టీమిండియాలో మరో తిక్క నిర్ణయం.. వైస్ కెప్టెన్ గా పుజారా.. కెప్టెన్ కూ తెలియదట

Update: 2022-12-13 10:55 GMT
బహుశా 2022 నడిచినంత దుర్భరంగా టీమిండియాకు మరే ఏడాదీ సాగి ఉండకపోవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలోనే టెస్టు, వన్డే, టి20 ఫార్మాట్ల సారథ్యం వివాదం తలెత్తింది. జనవరిలో జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి టెస్టును గెలిచి కూడా టీమిండియా సిరీస్ ఓడిపోయింది. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లి రాజీనామా చేశాడు. అంతకుముందే అతడు టి20 సారథ్యం వదులుకుని వన్డేలకు కొనసాగుతానంటే ఒప్పుకోలేదు. ఇదే సిరీస్ లో కెప్టెన్ రోహిత్ కు పగ్గాలిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, కోహ్లి పరిమిత ఓవర్ల సిరీస్ కు అందుబాటులో ఉండనంటూ ప్రకటించాడు. ఇలా ఎన్నో అనుమానాల మధ్య 2022 ప్రయాణాన్ని ప్రారంభించింది టీమిండియా.

ఆసియా పోయింది.. ప్రపంచ కప్ చేజారింది సెప్టెంబరు-అక్టోబరులో ఆసియా కప్ లో టీమిండియా ఉస్సూరుమంటూ వెనుదిరిగింది. నవంబరులో జరిగిన ప్రపంచ కప్ లో సెమీఫైనల్లో దారుణ పరాజయం ఎదుర్కొంది. కీలక పేస్ బౌలర్ జస్ప్పీత్ బుమ్రా గాయాలతో దాదాపు ఆరు నెలలుగా జట్టుకు అందుబాటులో లేడు. మరో ప్రధాన ఆటగాడు రవీంద్ర జడేజాదీ గాయాల గానమే. గాయపడ్డ పేసర్ షమీ బంగ్లాదేశ్ తో రేపటినుంచి జరిగే టెస్టు సిరీస్ ఆడడం లేదు. మరోవైపు సంజూ శాంసన్ వంటి ప్రతిభావంతుడికి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం లేదేమిటని సెలెక్టర్ల పై ఆగ్రహం.. టి20 ప్రపంచ కప్ వైఫల్యంతో అందరిపై మూకుమ్మడి వేటు. బంగ్లాతో వన్డే సిరీస్ లో పరాజయం.. కెప్టెన్ రోహిత్ శర్మ కు గాయం. ఇలా చెప్పుకొంటూ పోతే అంతా చింతే.

చోటే కష్టమనుకుంటే ఏకంగా వైస్ కెప్టెన్ ఆస్ట్రేలియాలో జరిగిన టి20 ప్రపంచ కప్ నకు జట్టు ఎంపికలో కొన్ని నిర్ణయాలు సెలక్టర్ల సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయి. హైదరాబాదీ సిరాజ్ వంటి పేసర్ ను తుది జట్టులోకి తీసుకోకపోవడంతో విమర్శలు వచ్చాయి. అదిపక్కన పెడితే ఇప్పుడు బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు సీనియర్ బ్యాట్స్ మన్ చతేశ్వర్ పుజారాను వైస్ కెప్టెన్ గా ప్రకటించారు. మూడేళ్లుగా ఫామ్ లో లేని పుజారా మధ్యలో ఉద్వాసనకు కూడా గురయ్యాడు. మళ్లీ జట్టులోకి వచ్చాడు. స్థాయి పరంగా పుజారాను తక్కువ చేయడం కాదు కానీ.. అతడికి ప్రస్తుత పరిస్థితుల్లో జట్టులో చోటు కష్టమే అన్నట్లుంది. ఒక్క రోజులో 500 పరుగులు చేస్తున్న జట్టు (ఇంగ్లండ్) ఉన్న రోజులివి. అలాంటిది టెస్టుల్లోనూ మరీ నిదానంగా ఆడతాడనే పేరున్న పుజారాపై వేటు కత్తి వేలాడుతోంది. కానీ, అతడిని బంగ్లా సిరీస్ కు వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు.

ప్రామాణికం ఏంటో: రాహుల్‌ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా టెస్టుల్లో ముద్ర చాటుతున్న రిషభ్ పంత్‌ను కాదని పుజారాను వైస్‌ కెప్టెన్‌గా నియమించడంపై మొదటే ఆశ్చర్యం వ్యక్తమైంది. దీనిపై కెప్టెన్‌ కేఎల్ రాహుల్ స్పందించాడు. పుజారా ఎంపిక ప్రమాణాలు ఏంటో తెలియవని పేర్కొన్నాడు. "ఎవరికి ఎప్పుడు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారో తెలియదు. అయితే పుజారాను ఏ ప్రామాణికం ప్రకారం ఎంపిక చేశారనేది నాకైతే తెలియదు. కానీ ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలి. నేను కూడా వైస్‌ కెప్టెన్‌ అయినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. జట్టుకోసం బాధ్యత తీసుకోవడం ఎప్పుడూ ఆనందమే. అయితే ఇదేమీ మనలో ఒక్కసారిగా భారీ మార్పులు తీసుకురాదు. ప్రతి ఒక్కరికి జట్టులో తమ పాత్ర ఏంటి..? బాధ్యతలు ఏంటనేది తెలుసు. జట్టు కోసం ఏం చేశామనేదే ముఖ్యం. రిషభ్‌ పంత్, పుజారా అద్భుతమైన ఆటగాళ్లు. కొన్ని సంవత్సరాలుగా ఇద్దరూ జట్టు కోసం చాలా చేశారు. పంత్‌ను కాదని పుజారాకు వైస్ కెప్టెన్సీ అప్పగించడంపై మరీ ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. జట్టుగా ముందుకు వెళ్లి విజయం సాధిస్తాం" అని వెల్లడించాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో యువ బ్యాటర్‌ శుబ్‌మన్ గిల్‌కు అవకాశం వస్తుందా..? అనే ప్రశ్నకు రాహుల్‌ సమాధానం ఇచ్చాడు. "శుబ్‌మన్‌ టాలెంటెడ్‌ ప్లేయర్. అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో ముందుంటాడు. టెస్టుల్లో ఎప్పుడైనా అతడికి అవకాశం రావొచ్చు. సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ దూకుడు ప్రదర్శించగలడు" అని చెప్పాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News