కుక్కతో వాకింగ్ నా..? ఐఏఎస్ జంటకు తగిన శాస్తి

Update: 2022-05-27 15:30 GMT
ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో పెంపుడు కుక్కతో వాకింగ్ కోసం ఏకంగా క్రీడాకారులను బయటకు పంపిన ఐఏఎస్ జంటకు కేంద్రప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.  ఇతర క్రీడాకారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎస్ దంపతులు సంజీవ్ ఖిర్వార్, రింకు దుగ్గాలను దేశంలోని చెరో దిక్కుకు సుదూర ప్రాంతాలకు బదిలీ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

పెంపుడు కుక్క కోసం స్టేడియాన్ని ఖాళీ చేయించారని వీరిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో 1994 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ సంజీవ్ ఖిర్వార్ ను కశ్మీర్ సరిహద్దు ప్రాంతం లఢక్ కు.. భార్య ఐఏఎస్ దుగ్గాను అరుణాచల్ ప్రదేశ్ కు బదిలీ చేస్తూ కేంద్రహోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

సంజీవ్, రింకూ ప్రతిరోజు సాయంత్రం తమ పెంపుడు శునకాన్ని ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియానికి వాకింగ్ కోసం తీసుకెళతారు. ఈ క్రమంలోనే స్టేడియంలో వారి కుక్క వాకింగ్ చేయాలని క్రీడాకారులను త్వరగా బయటకు పంపుతుండడంతో వాళ్ల ప్రాక్టీస్ పై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంచలన కథనం ప్రచురించింది. పెంపుడు కుక్కతో వాకింగ్ చేస్తున్న ఐఏఎస్ దంపతుల ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. వారిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఈ వివాదంపై స్పందించిన కేంద్రం తక్షణమే నివేదిక సమర్పించాలని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, కేంద్ర హోంశాఖను ఆదేశించింది. భార్యాభర్తలు అధికార దుర్వినియోగదానికి పాల్పడినట్లు నిర్ధారించిన కేంద్రం.. వారిద్దరినీ వేర్వేరు రాష్ట్రాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది.

ఢిల్లీలో ప్రభుత్వం ఉన్నా.. కేంద్రపాలిత ప్రాంతం కావడంతో అధికారుల నియామకం.. బదిలీ, సస్పెండ్ వంటి అంశాలపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది.

ఇక ఈ వివాదం నేపథ్యంలో ఢిల్లీలోని అన్ని క్రీడా ప్రాంగణాలు రాత్రి 10 గంటల వరకూ తెరిచే ఉంటాయని.. అథ్లెట్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రాక్టీస్ చేసుకోవచ్చని కేజ్రీవాల్ సర్కార్ ప్రకటించింది.
Tags:    

Similar News