కుక్కలమే అంటున్న రఘువీరా..

Update: 2015-04-12 09:50 GMT
ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తన దూకుడు ఏ మాత్రం తగ్గించను అంటూ భీష్మించుకున్నట్లుంది. ఏపీలోని పరిశ్రమలకు రాయితీ అందజేయడం ద్వారా రూ.500 కోట్ల ముడుపులు ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్‌ కుఅందాయని రఘువీరా ఆరోపించిన విషయం తెలిసిందే. చినబాబు అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని కూడా ఆయన డిమాండ్‌ చేశారు. దీనిపై ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. ఊరికే మొరిగే ఊరకుక్కలను ఊరు దాటిస్తారని..అలాగే గత ఎన్నికల్లో ఓడించడం ద్వారా ప్రజలు సైతం కాంగ్రెస్‌ ను ఊరుదాటించారని విమర్శించారు.

దీనికి రఘువీరా రెడ్డి సైతం ధీటుగా సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్‌ వాళ్లు కుక్కలేనని అయితే తాము కేవలం మొరిగే కుక్కలం కాదని తెలుగుతమ్ముళ్లు తెలుసుకోవాలని చెప్పారు. తాము కాపలా కుక్కలమని, ఏపీ ప్రజల కోసం కాపాల ఉంటామని.. రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి పోరాటం చేస్తామని చెప్పారు. చినబాబు రూ.500 కోట్ల ముడుపులు తీసుకున్నారనేది నిజమని...దీన్ని నిరూపించేందుకు సీబీఐ విచారణ జరపాలని పునరుద్ఘాటించారు.

ఏపీలో నామమాత్రపు ఉనికి ఉన్నప్పటికీ.. రఘువీరా తన టీమ్‌ తో పోరాటం బాగానే చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అయితే రఘువీరా వివాదాల కోసమే అన్నట్లు ఆరోపణలు చేయకుండా.. అందుకు తగ్గ ఆధారాలు కూడా బయటపెడితే బాగుంటుందేమో.


Tags:    

Similar News