వైసీపీతో పొత్తు పై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు!

Update: 2022-10-19 13:30 GMT
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో రాజ్యసభ ఎంపీ, కర్ణాటకకు చెందిన దళిత నేత మల్లిఖార్జున ఖర్గే విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి గాంధీ కుటుంబం నుంచి బయటి వ్యక్తి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినటై్టంది. మల్లిఖార్జున ఖర్గేకు కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో 7,987 ఓట్లు లభించాయి. ఇక ఆయన ప్రత్యర్థి శశి థరూర్‌కు 1000 ఓట్లు మాత్రమే వచ్చాయి. దామోదరం సంజీవయ్య తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రెండో దళిత వ్యక్తిగానూ మల్లిఖార్జున ఖర్గే రికార్డు సృష్టించారు.

కాగా కాంగ్రెస్‌ అధ్యక్షుడిపై ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఎవరున్నా గాంధీ కుటుంబం కనుసన్నల్లోనే నడవాల్సి ఉంటుందని కొందరు చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీలో అధ్యక్షుడే సుప్రీం లీడర్‌ అని రాహుల్‌ గాంధీ కుండబద్దలు కొట్టారు. తనతో సహా పార్టీ నాయకులంతా ఆయనకే రిపోర్ట్‌ చేయాలని తెలిపారు. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో కాంగ్రెస్‌ అధ్యక్షుడే నిర్ణయిస్తారని రాహుల్‌ వివరించారు.

ప్రస్తుతం రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో జరుగుతోంది. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ పడ్డ మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్‌ ఇద్దరూ అనుభవజ్ఞులేనని తెలిపారు. ఖర్గే విజయం సాధించడం పట్ల రాహుల్‌ ఆయనకు అభినందనలు తెలిపారు. ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్‌ తప్పకుండా బలపడుతుందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లో అవకవతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపైన రాహుల్‌ స్పందించారు. దేశంలో ఏ పార్టీకిలేని విధంగా కాంగ్రెస్‌ సీఈసీ ఉందని గుర్తు చేశారు. ఎలక్షన్‌ అథారిటీ చైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ నాయకత్వంలో కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించామన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో అవకతవకలు జరిగాయని శశిథరూర్‌ వర్గం చేసిన ఫిర్యాదుపై మధుసూదన్‌ మిస్త్రీ తప్పకుండా విచారణ జరుపుతారని రాహుల్‌ గాంధీ తెలిపారు.

కాగా భారత్‌ జోడో యాత్ర ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నానని రాహుల్‌ గాంధీ చెప్పారు. దేశంలో కొన్ని శక్తులు ద్వేషం, హింసను పెంచుతున్నాయని మండిపడ్డారు. నోట్ల రద్దు, జీఎస్టీ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయని ధ్వజమెత్తారు. ప్రధాన మంత్రి ఎప్పుడైనా ఇలాంటి ప్రెస్‌ మీట్‌ పెట్టడం ఎప్పుడైనా చూశారా? అని రాహుల్‌ ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైతే వైసీపీ మద్దతు తీసుకుంటారా అని విలేకరులు ప్రశ్నించగా.. రాహుల్‌ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. పొత్తుల విషయం, పార్టీకి సంబంధించిన ఏ విషయం ఉన్నా పార్టీ అధ్యక్షుడే నిర్ణయం తీసుకుంటారని తేల్చిచెప్పారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News