చంపారన్ ఉద్యమంతో రైతు ఆందోళనలను పోల్చిన రాహుల్

Update: 2021-01-03 14:30 GMT
37 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఉద్యమాన్ని బ్రిటీష్ కాలం ‘చంపారన్’ ఉద్యమంతో రాహుల్ గాంధీ పోల్చారు.  ప్రతిరైతును సత్యాగ్రహిగా పేర్కొన్నారు. రైతులు వారి హక్కులను తిరిగి సాధించుకుంటారని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఘాటు ట్వీట్ ను రాహుల్ చేశారు.

ఆనాడు బ్రిటీషర్ల కంపెనీ బహదూర్ ఉండేది. ఇప్పుడు మోడీ -ఆయన స్నేహితుల కంపెనీ బహదూర్ ఉంది.. ప్రస్తుతం దేశంలో చంపారన్ లాంటి ఒక విషాదం నెలకొంది’ అని రాహుల్ గాంధీ తన ట్విట్టర్ లో కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించారు.

బ్రిటీష్ పాలనలో స్వాతంత్య్రానికి పూర్వం 1917లో భారత్ లో మహాత్మాగాంధీ సారథ్యంలో చంపారన్ సత్యగ్రహ ఉద్యమం జరిగింది. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో దీన్ని చారిత్రక ఘటనగా చెబుతారు. అప్పట్లో బ్రిటీషర్లు రైతులతో బలవంతంగా ఇండిగో పంటను వేయించారు. డబ్బులు ఇచ్చేవారు కాదు.. దీంతో బీహార్ లోని చంపారన్ లో రైతులు బ్రిటీషర్లపై తిరగబడ్డారు. అలా చంపారన్ ఉద్యమం నడిచింది. ఇప్పటి రైతుల ఉద్యమాన్ని రాహుల్ నాటి ఉద్యమంతో పోల్చడం విశేషం.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 75 ఏళ్ల కశ్మీర్ సింగ్ అనే వృద్ధ రైతు నిరసన ప్రదేశంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో చనిపోయిన రైతుల సంఖ్య మూడుకు చేరింది.


Tags:    

Similar News