యువరాజు కాదు... మనలో ఒకడు

Update: 2022-09-07 15:30 GMT
ఆయన యువరాజు. ఆయనకేంటి. ఆయన పెట్టి పుట్టిన వారు. వారసత్వంగా గొప్ప పదవులు ఉన్నాయి.  అద్భుతమైన పార్టీ ఉంది. అధికారానికి దగ్గర చుట్టం. ఇలాంటివి గాంధీ కుటుంబ సభ్యుల విషయంలో తరచూ ప్రత్యర్ధులు చేసే విమర్శలు. వీటినే సామాన్య జనాలు కూడా ఎక్కువగా పట్టించుకుంటారు. దానికి తగినట్లుగా కొన్నాళ్ళ పాటు కధ సాగింది. నెహ్రూ నుంచి ఇందిర. ఆమె నుంచి రాజీవ్ గాంధీ. ఇక రాజీవ్ మరణం తరువాత కాంగ్రెస్ పగ్గాలు సోనియాకు, ఆమె నుంచి చాలా సులువుగా రాహుల్ గాంధీకు దఖలు పడ్డాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీ కుటుంబీకుల గుత్త సొత్తు అన్న భావన ఏర్పడింది.

అలాగే కాంగ్రెస్ పార్టీని జనాలే మోయాలి. పల్లకీలో కూర్చునేది వారే అన్న అభిప్రాయం ఉంది. గాంధీ ఫ్యామిలీ వారు అయితే చాలు కిరీటం పెట్టేస్తారు అన్న  విమర్శలు కూడా ఉన్నాయి. వీటి విషయంలో నిజాలకు నిందలకు మధ్య ఉన్న గట్టి పొరను చీల్చడానికే రాహుల్ గాంధీ భారత్ జోడీ యాత్రను చేపట్టబోతున్నారు. ఆయన దేశమంతా పాదయాత్ర చేపట్టనున్నారు. అతి సామాన్యుడిగా కష్టపడడానికి ఆయన నిర్ణయించుకున్నారు.

నిజానికి చూస్తే గాంధీ కుటుంబంలో  రాహుల్ గాంధీ చాలా భిన్నమైన వ్యక్తి. ఆయన తమ పూర్వీకుల మాదిరిగా కాస్తా అయినా ఆడంబరం చేయరు. ఆయన హై ప్రొఫైల్ మెయిన్ టెయిన్ చేయరు. ఆయన అతి సామాన్యుడిగా ఉంటారు. అందరితో కలసిపోతారు. కానీ రాహుల్ మీద వచ్చిన విమర్శల నేపధ్యంలో ఇవి మాత్రం గాలికి ఎక్కడో కొట్టుకుపోయాయి. పైగా రాహుల్ గాంధీ ఫ్యామిలీ వారసుడు అయినంత మాత్రాన ప్రధానిని చేయాలా అన్న ప్రశ్న కూడా జనాల వద్ద ఉంది. ఆయనకు కష్టం తెలియదు, యువరాజు ఆయన వారసత్వ రాజకీయాలు వద్దు అంటూ విపక్షాలు చేసే విమర్శలు కూడా జనాల్లోకి అలా వెళ్ళిపోయాయి.

ఇపుడు రాహుల్ గాంధీ యాత్రతో ఇవన్నీ పటాపంచలు చేయబోతున్నారు. తాను జనం మనిషిని అని ఆయన గట్టిగా చెప్పబోతున్నారు. తాను అతి సామాన్యుడిని అని రుజువు చేయబోతున్నారు. అందుకే ఆయన ఏకంగా మూడు వేల అయిదు వందల పై చిలుకు కిలోమీటర్ల దూరాన్ని ఆయన నడవబోతున్నారు. ఇది నిజంగా గ్రేట్ టాస్క్ గానే చూడాలి.

రాహుల్ గాంధీ వయసు ఇపుడు అయిదు పదులు దాటింది. పైగా ఆయన ఉన్నత కుటుంబంలో పుట్టారు. ఆయన ఎపుడూ గాలిలో విమానాల్లో తిరిగే నాయకుడు. అలాంటి రాహుల్ గాంధీ రోడ్డు మీదకు సామాన్యుల ఇంటి తలుపుని తడితే ఒక విధంగా అది సంచలనమే అవుతుంది. గాంధీ కుటుంబీకులు ఎపుడూ ఇలాంటి సాహసం చేయలేదు. ఆ మాటకు వస్తే దేశ రాజకీయాలలో పాదయాత్ర ఒక నాయకుడు చేసి కూడా అర్ధ శతాబ్దం దగ్గర పడుతోంది. చివరి సారిగా మాజీ ప్రధాని చంద్రశేఖర్ డెబ్బై దశాబ్ది చివరల్లో చేశారు.

అలాంటిది రాహుల్ పాదయాత్ర అంటే దేశం మొత్తం ఆసక్తిని చూపుతోంది. రాహుల్ కూడా కాంగ్రెస్ కి క్రెడిట్ వద్దు అంటూ కాంగ్రెస్ జెండా లేకుండానే ఈ యాత్రను చేపడుతున్నారు. విద్వేష పూరిత రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి దేశమంతా ఐక్యంగా ఉండడానికే ఈ యాత్ర అని ఆయన ఇస్తున్న సందేశం. ఈ యాత్ర మీద కాంగ్రెస్ కోటి ఆశలు పెట్టుకుంది. రాహుల్ కచ్చితంగా సక్సెస్ అవుతారు అని అంతా అంటున్నారు. రాహుల్ గాంధీ కూడా తనను తాను మార్చుకోవడానికే ఈ యాత్ర అంటున్నారు.

ఇక జనాలు సైతం రాహుల్ ని యువరాజుగా ఇక మీదట చూసే అవకాశం లేదు. ఆయన మనలో ఒకడు అని మాత్రమే చూస్తారు అని అంటున్నారు. అలా చూడాలన్నదే రాహుల్ యాత్ర అసలు లక్ష్యం. కన్యాకుమారి టూ కాశ్మీర్ దాకా సాగుతున్న రాహుల్ యాత్ర కాంగ్రెస్ కి ఒక ఆక్సిజన్ అని చెప్పాలి. అదే సమయంలో దేశాన్ని ఏలుతున్న మోడీకి ధీటైన నేతగా రాహుల్  ఈ యాత్ర తీర్చిదిద్దుతుందని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News