ఆది రాక వెనుక రూ.800కోట్లు..?

Update: 2016-01-02 06:10 GMT
కడప జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సైకిల్ ఎందుకు ఎక్కుతున్నారు? ఆయన టీడీపీ తీర్థం ఎందుకు పుచ్చుకుంటున్నారన్న? ప్రాధమిక ప్రశ్నలు చాలామందిలో ఉన్నాయి. అధికారంలో చేతిలో లేకపోవటం.. సమీప భవిష్యత్తులోనూ మార్పు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో.. విపక్ష నేత కంటే అదికారపక్ష నేతగా ఉండటం మంచిదన్న భావనలో ఆయన వర్గం చెబుతుంటోంది. అయితే.. ఆదినారాయణరెడ్డి సైకిల్ ఎక్కటానికి కారణం వేరే ఉందంటున్నారు ఆయన్ను వ్యతిరేకించేవారు.

ఆదినారాయణ రెడ్డి మీద విమర్శలు చేస్తున్న వారిలో తెలుగుదేశం నేతలే ఎక్కువగా ఉండటం గమనార్హం. తాజాగా సీనియర్ తెలుగు తమ్ముడు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఆదినారాయణ రెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదినారాయణ రెడ్డి వియ్యంకుడు.. ప్రముఖ విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డి రూ.800కోట్ల భారీ స్కామ్ చేశారని.. దీనికి సంబంధించి ఆయన కేసులు ఎదుర్కోవటం తెలిసిందే. వాటి నుంచి తప్పించుకోవటానికే ఆదినారాయణ రెడ్డి సైకిల్ ఎక్కేందుకు ఓకే చెబుతున్నట్లుగా వ్యాఖ్యానించటం గమనార్హం.

ఆదినారాయణ రెడ్డి తీరు చూస్తుంటే.. విడాకులు తీసుకోకుండానే మళ్లీ పెళ్లి చేసుకున్న చందంగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. తొలుత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చేరాలంటూ ఆయన సవాలు విసురుతున్నారు. మరి.. దీనికి ఆదినారాయణ రెడ్డి ఏం బదులిస్తారో..?
Tags:    

Similar News