కుటుంబం ఆత్మహత్య కేసులో రామకృష్ణ సెల్ఫీ వీడియో:. వైరల్

Update: 2022-01-06 09:43 GMT
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం సృష్టించిన కుటుంబం ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవపై మరో సంచలన విషయం బయటపడింది. ఆత్మహత్య చేసుకున్న రామకృష్ట తాను చనిపోయే ముందు సెల్ఫీ తీసుకొని తన గోడు వెళ్లబోసుకున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. ఆ వీడియోలో వనమా రాఘవపై రామకృష్ణ నమ్మలేని నిజాన్ని చెప్పాడు. భూ వివాదంలో జోక్యం చేసుకున్న రాఘవ తన భార్య విషయంలో అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశాడని రామకృష్ణ ఈ వీడియోలో తెలిపారు. దీంతో రామకృష్ణ ఆత్మహత్య కుటుంబానికి రాఘవనే కారణనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

‘నా ఆర్థిక పరిస్థితి ఆసరాగా చేసుకొని నా భార్యను హైదరాబాద్ తీసుకొని రమ్మని రాఘవ చెప్పాడు. తనను అన్ని విధాలుగా కాపాడుకుంటానని మాట ఇచ్చిన నా భార్యను అతడి దగ్గరికి ఎలా పంపగలను. రాఘవ డబ్బులు అడిగినా ఇచ్చేవాడిని. కానీ నా భార్యను కోరుకున్నాడు. అలా ఎలా ఇవ్వగలను.. ముందుగా నేను ఒక్కడినే చనిపోదామనుకున్నా.. కానీ నేను వెళ్లిన తరువాత నా భార్య, పిల్లలకు ఇబ్బందులు తప్పవని తెలుసుు. అందుకే నాతోనే వాళ్లని తీసుకుపోదామని డిసైడ్ అయ్యాను. నీ భార్యను నా దగ్గరికి పంపు లేకపోతే నీకు ఇబ్బందులు తప్పవని రాఘవ బెదిరించాడు.’ అని రామకృష్ణ ఈ వీడియోలో తెలిపారు.

‘రాజకీయ అహంకారంతో, ఆర్థిక బలంతో అవతల మనషిని బలహీనతలను గ్రహించి ఇలా తన పబ్బం గడుపుకుంటున్నాడని అన్నారు. ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలని ప్రశ్నించారు. వనమా వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. 12 సంవత్సరాల మా సంసార జీవితంలో ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా చేసుకున్నాము. అన్ని రకాల హామీలు ఇచ్చి పెళ్లి చేసుకున్నా. ఏ రకంగా నేను నా భార్యను ఆయన దగ్గరకు పంపగలను..? దయచేసి నేను ఆత్మహత్య చేసుకుంటున్న నిర్ణయాన్ని తప్పుబట్టకండి.. నాకు ఆర్థిక సాయం చేసిన వారికి నా తండ్రి ద్వారా వచ్చే ఆస్తి ద్వారా తిరిగి తీసుకోండి..కానీ.. ఇలాంటి దుర్మార్గులను మాత్రం ఎదగనివ్వకండి..’ అంటూ రామకృష్ణ ఆవేదన చెందాడు.

ఇదిలా ఉండగా వనమా రాఘవపై ఆరోపణలు రావడంతో ఆయ తండ్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వేంకటేశ్వర్ రావు రాజీనామా చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈమేకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక కుటుంబంలో భార్య, పిల్లలతో సహా నలుగురు ఆత్మహత్య చేసుకున్నా.. ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ విషయంపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని స్పందించారు. దీనిపై పూర్తిగా విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.




Full View
Tags:    

Similar News