ఆర్బీఐ హెచ్చ‌రిక: క‌రోనా న‌ష్టం నుంచి కోలుకునేందుకు ప‌దేళ్లు!!

Update: 2022-04-30 12:57 GMT
దేశంలో క‌రోనా పెట్టిన చిచ్చుతో.. అన్నివ్య‌వ‌స్థ‌లు కుప్ప‌కూలాయి. 2020-మార్చి త‌ర్వాత నుంచి విధించిన దాదాపు ఆరు మాసాల లాక్‌డౌన్ కార‌ణంగా.. అన్ని రంగాలు కుదేల‌య్యాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వానికి సైతం ఆదాయం త‌గ్గిపోయింది. ఇక‌, సామాన్యులు మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల సంగ‌తి చెప్పేదేముంది.? ఇలా అన్ని రంగాలు కూడా ఆర్థికంగా న‌ష్టాలు చ‌వి చూశాయి. అయితే.. ఈ న‌ష్టాల నుంచి బ‌య‌ట ప‌డేందుకు దాదాపు ప‌దేళ్ల స‌మ‌యం ప‌డుతుంద‌ని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పేర్కొంది.  

క‌రోనాకు ముందు.. త‌ర్వాత‌.. దేశంలో ఆర్థిక ప‌రిస్థితిని అంచ‌నా వేసిన ఆర్బీఐ.. ఒక నివేదిక‌ను విడుద‌ల చేసింది. క‌రోనా  సమయంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగిన ఆదాయ నష్టం దాదాపు రూ.52 లక్షల కోట్లు అని ఈ నివేద‌క‌లో పేర్కొంది.

2021-22 ఆర్థిక సంవత్సరానికి రిపోర్ట్ ఆన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్(ఆర్‌సీఎఫ్)లో ‘మహమ్మారి మచ్చలు’ అనే అధ్యాయంలో ఈ క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌, సెకండ్ వేవ్‌లు పదే పదే రావడం వల్ల నిలకడగా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఆటంకాలు ఏర్పడినట్లు తెలిపింది.

జీడీపీ(స్థూల దేశీయోత్పత్తి)లో త్రైమాసిక ధోరణులు ఈ క‌రోనా ఆటుపోట్లకు గురైనట్లు పేర్కొంది. 2020-21 తొలి త్రైమాసికంలో తీవ్రమైన క్షీణత నమోదైన తర్వాత 2021-22 ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో సెకండ్ వేవ్ కోవిడ్‌ వచ్చే వరకు ఆర్థిక వ్యవస్థ వేగం క్రమంగా పుంజుకుందని తెలిపింది. అదే విధంగా 2022 జనవరిలో మూడో ప్రభంజనం వల్ల ఆర్థిక వ్యవస్థ కోలుకునే ప్రక్రియకు పాక్షికంగా దెబ్బతగిలిందని పేర్కొంది.

ఉక్రెయిన్ యుద్ధం కూడా..

ప్రస్తుతం జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల అంతర్జాతీయ, దేశీయ వృద్ధికి జరుగుతున్న నష్టాలు నిత్యావసరాల ధరల పెరుగుదలలోనూ, అంతర్జాతీయ సరఫరాల వ్యవస్థలో అంతరాయాల ద్వారానూ స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆర్బీఐ వెల్లడించింది. ఈ యుద్ధం కూడా ముఖ్యమైన ఆర్ధిక మార్పున‌కు గుర్తుగా నిలిచిపోతుందని తెలిపింది. దీనివల్ల జరుగుతున్న వ్యవస్థా పరమైన మార్పులు మీడియం టెర్మ్‌లో వృద్ధి మార్గాన్ని మార్చే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ నివేదికను ఆర్బీఐలోని ఆర్థిక, విధాన పరిశోధన శాఖ(డీఈపీఆర్) రూపొందించింది. ఈ నివేదికలోని అంశాలన్నీ పూర్తిగా అధ్య‌య‌న క‌ర్త‌ల‌కు(కంట్రిబ్యూటర్స్‌) చెందినవేనని, తన అభిప్రాయాలు కాదని ఆర్బీఐ వివరించింది.

కోవిడ్ రావడానికి పూర్వం ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టిన సంస్కరణల ఫలితాలు, క‌రోనా సమయంలో చేపట్టిన అదనపు చర్యల ఫలితాలు నిలకడగా అధిక వృద్ధి బాట పట్టేందుకు దోహదపడతాయని పేర్కొంది.
Tags:    

Similar News