గ్రేటర్లో ఓటర్ల షాక్..లో పోలింగ్ ఎవరికి నష్టం ?

Update: 2020-12-01 15:17 GMT
ప్రతి ఎన్నికలోను వాళ్ళు షాక్ ఇచ్చారు, వీళ్ళు షాకిచ్చారని అనుకోవటం మామూలే . కానీ తాజాగా ముగిసిన గ్రేటర్ పోలింగ్ లో రాజకీయపార్టీలకు ఏకంగా ఓటర్లే షాక్ ఇచ్చారు. కడపటి వార్తలు అందేసరికి అంటే 5 గంటలకు నమోదైన ఓటింగ్ శాతం 35. 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి మహా అయితే మరో నాలుగు శాతం పెరిగే అవకాశం ఉంది. అంటే ఏ పద్దతిలో చూసుకున్నా పోలింగ్ శాతం 40 కన్నా దాటే అవకాశాలు తక్కువనే చెప్పాలి. పోయిన ఎన్నికల్లో కూడా నమోదైన పోలింగ్ శాతం 45 మాత్రమే.

హోరా హోరీగా సాగిన ప్రచారం తర్వాత కూడా పోలింగ్ శాతం ఇంత తక్కువగా జరగటానికి కారణాలు ఏమిటి ? ఎందుకంటే ఇంత తక్కువ పోలింగ్ శాతాన్ని రాజకీయపార్టీలేవీ ఊహించలేదు. పోలింగ్ శాతం ఎక్కువగా జరిగితే అధికారపార్టీకే నష్టమనే అంచనా ఒకటుంది మన దగ్గర. మరి పోలింగ్ శాతం తక్కువగా జరిగితే ఎవరికి నష్టం ? అన్నదే పెద్దద పజిల్ గా మారిపోయింది.

సరే ఏ పార్టీకి నష్టం జరుగుతుందనే విషయం ఇప్పటికిప్పుడే విశ్లేషించటం కష్టమే. ఎందుకంటే బుధవారం మధ్యాహ్నానికి కానీ అధికారికంగా సరైన పోలింగ్ పర్సంటేజి రాదు. కాబట్టి అప్పటిదాకా అసలు ఇంత తక్కువ పోలింగ్ కు కారణాలు ఏమిటి అనేది చూద్దాం. ఇందుకు ప్రధానంగా నాలుగు కారణాలు కనబడుతున్నాయి.

అవేమిటంటే మొదటిది కరోనా వైరస్ సమస్య. రెండోది లాక్ డౌన్ కారణంగా చాలా సాఫ్ట్ వేర్ కంపెనీలకు శెలవులు ఇచ్చేశారు. దాని కారణంగా తమ సొంత ఊర్లకు వెళ్ళిపోయిన లక్షలాది మంది టెక్కీలు ఇంకా తిరిగి హైదరాబాద్ కు చేరుకోలేదు. మూడోది ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్-ఎంఐఎం-బీజేపీ నేతల మధ్య జరిగిన ప్రచార యుద్ధం. ఇటువంటి ప్రచారం వల్ల చాలా ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి.

పోలింగ్ ముందు రోజు రాత్రి కూడా ఓల్డ్ సిటిలో ఎంఐఎం-బీజేపీ నేతల మధ్య దాడులు జరిగాయి. అలాగే టీఆర్ఎస్-బీజేపీ నేతల మధ్య కూడా కొన్ని చోట్ల దాడులు జరిగాయి. దీని కారణంగా పోలింగ్ సందర్భంగా చాలా చోట్ల గొడవలు జరుగుతాయని జనాలు ఊహించుకున్నారు. ఇక చివరగా చలి కాలం అవ్వటం కూడా ఓ కారణంగా చెప్పుకుంటున్నారు. ఇటువంటి అనేక అంశాల కారణంగా పోలింగ్ శాతం చాలా దారుణంగా పడిపోయింది. మరి దీని ఎఫెక్టు ఏ పార్టీపై పడుతుందో చూడాల్సిందే.
Tags:    

Similar News