‘క్యూ2’లో అదరగొట్టేసిన రిలయన్స్.. కళ్లు చెదిరేలా గణాంకాలు

Update: 2021-10-24 02:30 GMT
దేశంలోని దిగ్గజ కంపెనీల్లో ఒకటిగా.. తరచూ విజయవంతమైన వార్తలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రిలయన్స్ సంస్థ తాజాగా మరోసారి తన సత్తాను చాటింది. ఈ ఆర్థిక సంవత్సరంలో క్యూ2లో ప్రోత్సాహక ఫలితాల్ని ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జులై - సెప్టెంబరు త్రైమాసికానికి సంబంధించి నికర లాభం 43 శాతాన్ని చేరుకున్న వైనం ఆసక్తికరంగా మారింది. భిన్నమైన వ్యాపారాల్ని చేస్తూ.. అన్నింటిలోనూ సత్తా చూపే రిలయన్స్.. గత ఏడాది క్యూ2తో పోల్చినప్పుడు కూడా.. మరింత మెరుగైన ఫలితాల్ని సాధించటం గమనార్హం.

గత ఏడాది క్యూ2లో రూ.9567 కోట్ల లాభాన్ని ఆర్జిస్తే.. ఈ ఏడాది అందుకు భిన్నంగా ఏకంగా రూ.13,680 కోట్ల నికర లాభాన్ని సాధించటం విశేషం. ఇంతటి ఫలితాలకు కారణం.. చమురు ధరలు భారీగా పెరగటం.. రిటైల్ బిజినెస్ జోరందుకోవటం.. టెలికం బిజినెస్ పుంజుకోవటం లాంటివి భారీ లాభాలకు కారణమైనట్లు చెబుతున్నారు.

కంపెనీ మొత్తం నాలుగు ప్రధాన బిజినెస్ లను కలిగి ఉందన్న సంగతి తెలిసిందే. ఆయిల్ టు కెమికల్ (ఓటూసీ).. రిటైల్.. డిజిటల్ సర్వీసులతో పాటు కొత్త ఇంధన బిజినెస్ లు ఉన్నాయి.  ఓటూసీ విభాగంలో 58 శాతం వృద్ధిని చూపిస్తే.. నిర్వహణ లాభం 44 శాతం ఎదిగింది. రిలయన్స్ రిటైల్ విషయానికి వస్తే నిర్వహణ లాభం 45 శాతానికి వచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసిన 813 స్టోర్లను కలుపుకుంటే మొత్తం స్టోర్లు 13,635కు చేరుకున్నాయి. మిగిలిన విభాగాలతో పోలిస్తే తక్కువ వృద్ధి రేటు జియోలో నమోదైంది. ఇందులో 23.5 శాతం మాత్రమే వృద్ధిని ప్రదర్శించింది. చమురు.. గ్యాస్ విభాగంలో ఆదాయం ఏకంగా 363 శాతం పురోగమించటం గమనార్హం.

తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబరు నాటికి కంపెనీ చేతిలోని నగదు.. గ్రూపు విలువ రూ.2,59,476 కోట్లుగా నమోదైంది. నికరంగా రుణరహిత కంపెనీగా ఉన్న రిలయన్స్ కు జియోలో మొత్తం వినియోగదారులు 429.5మిలియన్లుగా ఉన్నారు. ఈ ఏడాది క్యూ2లో ఆకర్షణీయమైన లాభాల్ని సాధించినందుకు సంతోషంగా ఉందని గ్రూపు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ముకేశ్ అంబానీ వెల్లడించారు.
Tags:    

Similar News