పవన్ కల్యాణ్‌‌ ను వెన్నుపోటు పొడవబోతున్న నాదెండ్ల మనోహర్: ఆర్జీవీ

Update: 2018-12-21 05:18 GMT
వివాదాల రారాజు రాంగోపాల్ వర్మ సినిమాల విషయంలోనే కాదు రాజకీయాల విషయంలోనూ ఇటీవల ఏదో ఒకటి కెలుకుతూ నిత్యం వార్తల్లో ఉండడమో.. తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడమో చేస్తున్నారు. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేగేలా సంచలన ట్వీట్ చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ కు ఆ పార్టీ నేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉందంటూ వరుస ట్వీట్లు చేశారు.
  
ఈ మధ్య పవన్ పాల్గొనే ప్రతి కార్యక్రమంలోనూ మనోహర్ పక్కనే నవ్వుతూ కనిపిస్తున్నారని.. ఒకప్పుడు ఎన్టీఆర్ పక్కన మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కరరావు కూడా అలాగే నవ్వుతూ ఉండేవారని ఆయన ఓ ట్వీట్‌లో రాశారు. అప్పట్లో ఎన్టీఆర్‌ కు నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచినట్లే ఇప్పుడు పవన్‌ కు మనోహర్ వెన్నుపోటు పొడుస్తారని ఆయన అన్నారు.
  
పవన్ ప్రజా సమస్యల పై పోరాడుతుంటే ఆయన్ను వెనుక నుండి వెన్నుపోటు పొడించేందుకు మనోహర్ ప్రయత్నిస్తున్నారని ఆర్జీవీ ఒక ట్వీట్‌ లో ఆరోపించారు. నాదెండ్ల మనోహర్.. పవన్‌ కు వెన్నుపోటు పొడవకూడదని తాను తిరుపతి బాలాజీని ప్రార్థిస్తున్నానంటూ మరో ట్వీట్ చేశారు. పవన్ ఎంతగొప్పోడని అభిమానులు అనుకున్నాకూడా ఎన్టీఆర్ లాంటి వ్యక్తే వెన్నుపోటు నుంచి తప్పించుకోలేకపోయారని.. పీకే కు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చ ప్రమాదముందని ఇంకో ట్వీట్లో అన్నారు.
  
నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు యత్నాల్లో ఉన్నట్లు తనకు జనసేన వర్గాల నుంచి సమాచారం ఉందని.. ఈ సంగతి నాదెండ్ల కుటుంబీకులకు తెలుసని వర్మ ట్వీట్ చేశారు. వరుస ట్వీట్ల లో చివరగా ప్రజల నుంచి సమాధానం తెలుసుకునేందుకు గాను ఒక పోల్ కూడా పోస్ట్ చేశారు. అందులో నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు, చంద్రబాబు వెన్నుపోట్లలో ఏది అత్యంత దారుణమైనది అంటూ నెటిజన్లను ప్రశ్నించారు. అయితే.. దీనికి ట్విటర్ యూజర్ల నుంచి భిన్నమైన స్పందన వచ్చింది. ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినవారికంటే ఆయన్ను, ఆయన పద్దతులను తిట్టినవారే ఎక్కవగా కనిపించారు.


Tags:    

Similar News