అమరావతికి ఆ నగరాలు ఆదర్శం

Update: 2015-12-03 11:21 GMT
నవ్యాంధ్ర కొత్త రాజధాని అమరావతిని అద్భుత రీతిలో మలచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నడుంకట్టారు. అదే సమయంలో హైదరాబాద్‌ నగర శివార్లలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఆధునిక నగరం అభివృద్ధి చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రతిపాదిస్తున్నారు. ఈ దశలో దేశంలో నిర్మాణరంగంలో సరికొత్త ఆవిష్కరణలపై విస్తృతస్థాయిలో చర్చ జరుగుతోంది.  హైదరాబాద్‌ లోనే ఉన్న రామోజీ ఫిలింసిటీ వంటివాటిపై చర్చ జరిగినా అక్కడ సినీ హంగులే తప్ప పౌర జీవన పరిస్థితులకు తగ్గట్లుగా ఉన్న ప్రాంతం కాదన్న వాదనా ఉంది.  శంషాబాద్‌ - ఢిల్లి గ్రీన్‌ ఎయిర్‌ పోర్టుల నిర్మాణం కూడా పరిశీలనార్హమే. అయితే వీటన్నిటికీ మించిపోయేలా బెంగాలీలు నిర్మించిన రెండు నగరాలు ఇప్పుడు నిర్మారణ రంగానికి ఆదర్శంగా నిలుస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.

సహారా అధినేత సుబ్రతో రాయ్‌ పేరు చెప్పగానే ఆయనపై ఉన్న కేసులు - అరెస్టులు వంటివే గుర్తొస్తాయి. కానీ, ఆయన సాధించిన ఘనతలూ తక్కువేమీ కాదు.  ప్రభుత్వం పాత్ర ఏమాత్రం లేకుండా అద్భుత నగరాన్ని నిర్మించారాయన. ముంబయి - పుణెల మధ్య ఉన్న ఆంబీ వ్యాలీ సిటీ సుబ్రతో నిర్మించిందే.  10,600ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఆశించకుండా కొండలు - కోనలు - సెలయేర్లు - నదులతో కూడిన ప్రాంతాన్ని రాయ్‌ నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి పూర్తిగా తన సొంత నిధులు - ఆర్థికసంస్థల సహకారంతోనే ఈ నగరాన్ని నిర్మించారు. ఇందులో పదోవంతు స్థలంలో మాత్రమే కట్టడాలు కట్టారు. మిగిలిన స్థలాల్ని ల్యాండ్‌ స్కేపింగ్‌ గా మార్చేశారు. పర్యావరణం ఉట్టిపడేలా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. ముందున్న కొండలు - కోనలు - సెలయేర్లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి పరిచారు. కేవలం నాలుగున్నరేళ్ళలోనే దీని నిర్మాణం జరిగింది.

ముంబై-పుణె జాతీయ రహదారిపై గల లోనావాలా పట్టణానికి కేవలం 23కిలోమీటర్ల దూరంలోనే ఇది ఉంది. పరిసరాల్లోనే రెండు అంతర్జాతీయ ఎయిర్‌ పోర్టులున్నా ఆంబీ నగరంలో కూడా ప్రత్యేకంగా ఎయిర్‌ స్ట్రిప్‌ నిర్మించారు. దీంతో పాటు 12 హెలీపాడ్‌ లు ఏర్పాటు చేశారు. ఇందులో కాటేజ్‌లు - విల్లాలు - గ్రూప్‌ హౌసింగ్‌ - బహుళ అంతస్తుల భవనాలు - కారి డార్‌ లు - ఫంక్షన్‌ హాళ్ళు నెలకొల్పారు. డజన్ల సంఖ్య లో స్విమ్మింగ్‌ పూల్‌ లు - ఇండోర్‌ - ఔట్‌ డోర్‌ క్రీడా మైదానాలు - వాలీబాల్‌ కోర్టులు - సినిమా థియేటర్లతో పాటు గోల్ఫ్‌ కోర్డుల్ని కూడా ఏర్పాటు చేశారు. సెలయే ళ్ళను అభివృద్ధి చేసి హౌస్‌ బోట్‌ లలో పడవ ప్రయాణ సదుపాయాల్ని కల్పించారు. నిరంతర విద్యుత్‌ - మంచినీటి సరఫరాతో పాటు అత్యాధునిక కమ్యూనికే షన్‌ వ్యవస్థ నెలకొల్పారు. నగరం చుట్టూ మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అత్యద్భుత పర్యావరణహితంగా తీర్చిదిద్దారు. విలాసజీవనం తో పాటు వ్యాపారాల నిర్వహణకు అనువైన కార్యాల యాల ఏర్పాటుకు అనుగుణంగా అభివృద్ధి పరిచా రు. అంతర్జాతీయ స్థాయి సదస్సులు - సెమినార్‌ ల నిర్వహణకు అనువైనా కాన్ఫరెన్స్‌ హాల్స్‌ - థియేటర్ల తో పాటు అతిథులకు అవసరమైన అన్నిరకాల వసతి సదుపాయాల్ని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే ఈ నగరాన్ని చూసి అంతర్జాతీయస్థాయి పర్యాటకలు - పారిశ్రామికవేత్తలు - వ్యాపారులు ఆశ్చర్యచకితులవుతుంటారు.  దేశంలో రైల్వేల తర్వాత అధిక సంఖ్యలో జనానికి ఉపాధి అవకాశాలు కల్పించిన వ్యక్తిగా ఒకప్పుడు టైమ్‌ మేగజైన్‌ జాబితాకు ఎక్కిన రాయ్‌ కేవలం డిపాజిట్ల సేకరణలో సాంకేతిక అంశాల పరిధి దాటారన్న కారణంతో ఇప్పుడు జైళ్లో ఉన్నారు.  అయితే... సంపద సృష్టించడం.. ఉపాధి కల్పించడంలో అత్యంత విజయవంతమైన వ్యక్తిగా పేరొందిన సుబ్రతో రాయ్ వంటివారి సలహాలు - సూచనలు ఆధునిక నగరాల నిర్మాణాల కోసం తీసుకోవచ్చని పలువురు సూచిస్తున్నారు.

మరోవైపు కోల్ కతాలో సాల్ట్ లేక్ సిటీగా పేరుగాంచి ప్రస్తుతం బిధాన్ నగర్ గా పిలుస్తున్న ప్రాంతం కూడా అమరావతి నగరానికి ఆదర్శంగా నిలిచేలా ఉంది. బిధాన్ నగర్ అత్యంత ప్రణాళికాబద్ధమైన శాటిలైట్ సిటీ. 1958, 65 మధ్య దీన్ని నిర్మించినా ఇప్పుడు పూర్తిగా కొత్త రూపు సంతరించుకుంది. ఐటీ రంగానికి చిరునామా. పశ్చిమబెంగాల్ లో ఆర్థిక, సామాజిక నాగరికతకు ఇది ప్రధాన కేంద్రం. మౌలిక సదుపాయాలు, ప్రణాళికాబద్ధమైన నిర్మాణం, వసతులకు ఇది పేరొందిన ప్రాంతం. అంతేకాదు... ఇంకో గొప్ప విషయమేంటంటే.. బిధాన్ నగర్ చుట్టూ ఉన్న సరస్సులు, చెరువులు ఒక్కటి కూడా కబ్జా కాకుండా చూడడంతో ఇక్కడ వరద ముప్పు వంటివే లేనేలేవు. అమారవతి నగర నిర్మాణంలో ఇది కీలకాంశం కాబట్టి దీన్ని పరిశీలించొచ్చు.
Tags:    

Similar News