రొమేనియా బాలిక రేప్ కేసు.. ఎట్టకేలకు ఎమ్మెల్యే కొడుకు పై కేసు నమోదు..

Update: 2022-06-08 03:29 GMT
హైదరాబాద్ ఆమ్నేషియా పబ్లో, కార్లో రొమేనియా బాలికపై అత్యాచారానికి సంబంధించి పాతబస్తీకి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడిపైనా పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ఇప్పటికే వీడియోలు, సీసీ కెమెరాల రికార్డులు అత్యాచారం జరిగిన కార్లో ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడని తేల్చడంతో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకున్నాయి. ఓ ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుని అత్యాచారం నుంచి తప్పించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని నిప్పులు చెరిగాయి. దీంతో అతడిపైనా పోలీసులకు కేసు నమోదు చేయక తప్పలేదు. అయితే బాలికపై సామూహిక అత్యాచారంలో ఎమ్మెల్యే కొడుకు పాత్ర లేకున్నా బెంజ్‌ కారులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్టు గుర్తించారు. ఐపీసీతో పాటు పోక్సో చట్టం కింద సదరు మైనర్‌పై కేసు నమోదు చేశారు. ఇతడితో పాటు పరారీలో ఉన్న మరో బాలుడినీ కూడా పట్టుకున్నారు. వీరిని బుధవారం జువైనల్‌ హోమ్‌కు తరలించనున్నారు. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగుర్నీ అరెస్టు చేసినట్టయ్యింది.

నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులో నివసిస్తున్న ఓ బాలుడు స్కూల్స్‌ ప్రారంభమయ్యే లోపు హైదరాబాద్‌లో పార్టీ ఏర్పాటు చేయాలని భావించాడు. దానికి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసే బాధ్యతల్ని హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు స్నేహితులకు అప్పగించాడు. ఈ ముగ్గురూ మైనర్లే కావడం గమనార్హం. కాగా పార్టీ కోసం అనేక ప్రాంతాలను పరిశీలించిన ఈ ముగ్గురు మైనర్లు ఆమ్నేషియా అండ్‌ ఇన్సోమ్నియా పబ్‌ను చివరకు ఎంపిక చేశారు.

ఈ విషయం బెంగళూరు బాలుడికి చెప్పడంతో అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఏప్రిల్‌ 19న 'ఇన్సోమ్నియా కమింగ్‌ సూన్‌' అంటూ పోస్టు చేశాడు. హైదరాబాద్ లో ఉన్న ముగ్గురు మైనర్లు కావడంతో పబ్‌ ను బుక్‌ చేయడానికి తమ స్నేహితుడైన ఉస్మాన్‌ అలీ ఖాన్‌ను సంప్రదించారు. ఆయన ద్వారా పబ్‌ ఎండీ కునాల్‌ను సంప్రదించారు. అతడితో బేరాలాడి ఒక్కొక్కరికీ ఎంట్రీ రేటును రూ.1,200 నుంచి రూ.900కు తగ్గించేలా చేశారు.

తర్వాత బెంగళూరు బాలుడు తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో 'ఇన్సోమ్నియా పార్టీ ఆన్‌ మే 28 ఎట్‌ 1 పీఎం' అంటూ పోస్టు చేశాడు. అక్కడే తన ఫోన్‌ నంబర్‌ సైతం ఇచ్చాడు. దీంతో హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన అతడి ఫాలోవర్స్‌ 150 మంది తాము పార్టీలో పాల్గొంటామంటూ కోరారు. దీనికి బెంగళూరు బాలుడు సరేనన్నాడు. అయితే వీరికి మాత్రం పబ్ రేటు రూ.1,200 నుంచి రూ.900కు తగ్గిన విషయం చెప్పలేదు. వారి నుంచి రూ.1200 చొప్పున వసూలు చేశాడు.

ఇక అత్యాచారానికి గురయిన బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన రొమేనియా బాలికకు బెంగళూరు బాలుడు స్నేహితుడు కావడంతో ఆమె కూడా రూ.1,200 చెల్లించి పార్టీకి రావడానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలో మే 25న హైదరాబాద్‌కు వచ్చిన బెంగళూరు బాలుడు పబ్‌కు వెళ్లి చూడటంతో పాటు పబ్ యాజమాన్యానికి రూ.లక్ష అడ్వాన్స్‌గా చెల్లించాడు. ఇది నాన్‌ ఆల్కహాలిక్‌ అండ్‌ నాన్‌ స్మోకింగ్‌ పార్టీగా ప్రచారం చేశారు. కాగా రొమేనియా బాలిక మే 28న బెంగళూరు బాలుడితో కలిసి పబ్‌కు వచ్చింది. అక్కడే ఈమెకు మరో బాలికతో పరిచయమైంది. కొద్దిసేపటికి పబ్‌కు వచ్చిన సాదుద్దీన్‌ సహా మిగిలిన బాలురు ఈ ఇద్దరు అమ్మాయిలను పరిచయం చేసుకున్నారు.

పబ్‌లో అంతా డ్యాన్స్‌ చేస్తున్న సమయంలోనే రొమేనియా బాలికపై అత్యాచారానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆమెతో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఇది ఇబ్బందికరంగా భావించిన రొమేనియా బాలిక, మరో బాలిక బయటకు వచ్చేశారు. వీరి వెనుకాలే సాదుద్దీన్‌ తదితరులు కూడా బయటకు వచ్చారు. మరో బాలిక వెళ్లిపోగా.. రొమేనియా బాలికను ట్రాప్‌ చేశారు. కారులో ఇంటి వద్ద దింపుతామని తమ బెంజ్‌ కారులో బాలికను ఎక్కించుకున్నారు. కారులో ఎమ్మెల్యే కుమారుడితో పాటు మరో ముగ్గురు బాలురు ఎక్కారు. దీని వెనుక ఇన్నోవా కారులో డ్రైవర్‌ జమీల్, సాదుద్దీన్, ముగ్గురు బాలురు అనుసరించారు. బెంజ్‌ కారులో ఉన్న నలుగురూ మరోమారు బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు.

ఇలా కారులో బాలికను తిప్పుతూ ఆమెపై అసభ్య చేష్టలకు పాల్పడ్డారు. చివరకు ఈ రెండు వాహనాలు బంజారాహిల్స్‌ రోడ్‌ నం.14లోని కాన్సూ బేకరీ వద్దకు చేరుకున్నాయి. అక్కడ బాలిక బెంజ్ కారు నుంచి ఇన్నోవా కారులోకి మారింది. దీంతో డ్రైవర్‌తో పాటు మరో బాలుడిని అక్కడే వదిలేశారు. ఓ ఫోన్‌ కాల్‌ రావడంతో ఎమ్మెల్యే కుమారుడూ కూడా వెళ్లిపోయాడు. సాదుద్దీన్‌తో పాటు మిగిలిన నలుగురు బాలురు రొమేనియా బాలికను పెద్దమ్మ గుడి ప్రాంతంలోకి తీసుకువెళ్లారు. అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సందర్భంలో ఆమె మెడపై టూత్ టాటూల పేరుతో గాయాల చేశారు. అనంతరం బాలికను ఆమ్నేషియా పబ్‌ వద్దకు తీసుకొచ్చి వదిలేశారు. ఆ తర్వాత తండ్రికి ఫోన్‌ చేసిన బాలిక ఆయనతో కలిసి తన ఇంటికి చేరుకుంది.

బాలికపై మే 28న అత్యాచారం జరగ్గా 31వ తేదీ వరకు బాలిక ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పలేదు. ఆ రోజు తనపై నలుగురు అసభ్యంగా ప్రవర్తించారని మాత్రమే చెప్పింది. ఆయన ఈ మేరకు డీసీపీని కలిపి ఫిర్యాదు చేశారు. అసభ్య ప్రవర్తన కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు భరోసా కేంద్రంలో బాలికకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

ఆ సమయంలో బాలిక సామూహిక అత్యాచారం విషయాన్ని బయట పెట్టడంతో కేసులో ఆ సెక‌్షన్లు కూడా చేర్చారు. సాదుద్దీన్‌తో పాటు ముగ్గురు బాలురను పట్టుకుని చర్యలు తీసుకున్నారు. కాగా, సోమవారం మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇచ్చిన బాలిక బెంజ్‌ కారులో ఎమ్మెల్యే కుమారుడు అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని వెల్లడించింది. దీంతో ఐపీసీలోని 354, 323తో పాటు పోక్సో యాక్ట్‌లోని 9(జీ) రెడ్‌విత్‌ 10 సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. ఈ బాలుడితో పాటు అత్యాచారం కేసులో పరారీలో ఉన్న మరో బాలుడినీ కూడా అరెస్టు చేశారు. కాగా అత్యాచారం ఘటనలో హోంమంత్రి మహమూద్ అలీ మనవడి పాత్ర ఏమాత్రం లేదని పోలీసు కమిషనర్ స్పష్టం చేశారు.
Tags:    

Similar News