జకీర్ తల తెస్తే రూ.50లక్షలంటున్న సాధ్వీ

Update: 2016-07-14 05:53 GMT
ముందు వెనుకా చూసుకోకుండా పోటాపోటీగా ప్రకటనలు చేయటం ఈ మధ్యన ఎక్కువైంది. ఒకరు వెధవ పని చేస్తే.. ఆ వెధవ పనికి మించిన తీరులో వ్యవహరించాలన్నట్లుగా చేస్తున్న వ్యాఖ్యలు కొత్త అలజడులను సృష్టిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న మత గురువుపై చట్టబద్ధంగ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు చేయాల్సిన స్థానే.. తాలిబన్ల మాదిరి తల నరికి తెండి? ఇంత తీసుకోండి అన్నట్లుగా చేస్తున్న ప్రకటనలు షాకింగ్ గా మారాయి. ఇలాంటి ప్రకటనలు చేస్తూ వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తున్న నేతల జోరును అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.

చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడినప్పుడు వారిపై చట్టపరమైన చర్యల కోసం డిమాండ్ చేయటంలో తప్పు లేదు. కానీ.. అది వదిలేసి.. సంలచనాల కోసమన్నట్లుగా చేస్తున్న బహిరంగ ప్రకటనలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వివాదాస్పద మత గురువు జకీర్ నాయక్ వ్యవహారమే చూస్తే.. ఆయన్ను చంపేస్తే రూ.15 లక్షలు ఇస్తామని షియా గ్రూపునకు చెందిన హుస్సేనీ టైగర్స్ ప్రకటన చేస్తే.. అంతకు మించి అన్నట్లుగా వీహెచ్ పీ నాయకురాలు సాధ్వీ ప్రాచీ సంచలన ప్రకటన చేశారు.

ఇస్లామిక్ బోధనల పేరిట ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్ తలను నరికి తీసుకొచ్చిన వారికి రూ.50 లక్షలు బహుమానంగా తాను ఇస్తానంటూ ఆమె ప్రకటించారు. జకీర్ ఇస్లామిక్ మత గురువు కాదని ఉగ్రవాదిగా ఆమె అభివర్ణించారు. జకీర్ ను చంపేసిన వారికి తాను ఇస్తానని చెప్పిన రూ.50లక్షల బహుమానాన్ని తాను ఏ సంస్థ నుంచి తీసుకోనని.. తానే సొంతంగా ఇస్తానని సాద్శీ ప్రాచీ పేర్కొనటం గమనార్హం. ఇంతకీ సాధ్వీ ప్రాచీ ఆస్తుల కతేంటి? ఆమె ఆదాయ మార్గాలేంటి? ఆమె వార్షిక ఆదాయపన్ను ఎంత చెల్లిస్తున్నారన్న అంశాల మీద ఐటీ శాఖ దృష్టి పెడితే బాగుంటుందేమో..?
Tags:    

Similar News