స్పెష‌ల్ పోరుతో టీడీపీ - బీజేపీకి చెమ‌టలు

Update: 2015-12-09 08:00 GMT
ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా డిమాండ్ మ‌రింత వేడెక్కుతోంది. ఆంధ్రుల ఆకాంక్ష‌కు ప్ర‌తిబింభమైన స్పెష‌ల్ స్టేట‌స్ ద‌క్కించ‌డంలో తీవ్ర జాప్యం జ‌రుగుతుండ‌టంతో నిర్ణ‌యాధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. అదే స‌మ‌యంలో ఏపీలో పాల‌న ప‌గ్గాలు చేప‌ట్టిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై అస‌మ్మ‌తి షురూ అవుతోంది. ఈ క్ర‌మంలో ఇన్నాళ్లు ఏపీలో నిర‌స‌న తెలిపిన ఆయా ప‌క్షాలు ఇపుడు ఢిల్లీ వేదిక‌గా పోరు స‌ల్పుతున్నాయి. చిత్రంగా ఇందులో టీడీపీ-బీజేపీ మిన‌హా ఏపీలోని అన్ని ముఖ్య‌మైన పార్టీలు పాలుపంచుకోవ‌డం పరిస్థితికి అద్దంప‌డుతోంది.

ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద ఆంధ్ర‌ప్రదేశ్‌ ప్రత్యేక హోదా సాధన కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. రాష్ట్ర నలుమూలల నుండి వందలాదిగా తరలివచ్చిన ప్రత్యేక సాధన కమిటీ కార్యకర్తలు ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు - రాజ్యసభ సభ్యుడు జైరామ్‌ రమేష్‌ మాట్లాడుతూ - ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి విభజన సమయంలోనే కాంగ్రెస్‌ కట్టుబడి ఉండ‌టం వ‌ల్లే ప్రత్యేక హోదా ప్రకటించిందన్నారు. మోడీ సర్కార్ ఏపీ పట్ల వివక్ష చూపుతుందని త‌ద్వారా ఆంధ్రప్రదేశ్‌ కు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

వైసీపీ లోక్‌ సభ పక్షనేత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి ప్ర‌సంగిస్తూ.. ఆంద్రప్రదేశ్‌ కు తక్షణమే ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ...ప్రత్యేక హోదాతో రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తుందని, దీంతో పాటు పారిశ్రామికాభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పారు. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ప్రధాని మోడీ మట్టి - నీరు ఇచ్చి అవమానపరిచారని ఆరోపించారు. ప్రత్యేక హోదాను మోడీ దాటవేస్తున్నార‌ని విమర్శించారు.

వీరితో పాటు మ‌రికొంద‌రి ప్ర‌సంగిస్తూ... స్పెష‌ల్ స్టేట‌స్ కు బీజేపీ-టీడీపీలే అడ్డు అని దుయ్య‌బ‌ట్టారు.ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా చీకటి ఒప్పందం కాదని, నిండు పార్లమెంట్‌ లో నాటి ప్రభుత్వం ఇచ్చిన హామీ అని, దానికి నేటి మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యక్ష సాక్షి అని వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్పష్టం చేశారు.  ప్ర‌సంగాల అనంతరం ప్రధాని మోడీ నివాసం వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నిం చగా మార్గమద్యలోనే పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంపీ డి.రాజా - రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ - పార్వర్డ్‌ బ్లాక్‌ జాతీయ కార్యదర్శి దేవరాజన్‌ - కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు - టి.సుబ్బిరామిరెడ్డి - మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ - ఆంధ్ర మేథావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ - లోక్‌ సత్తా నాయకులు పాల్గొన్నారు.
Full View

Tags:    

Similar News