ఒంగోలు బిర్యానీ పాయింట్ ఆరాచకం తెలిస్తే అవాక్కే

Update: 2021-04-07 07:30 GMT
ఆరాచకానికి పరాకాష్ఠ లాంటి ఉదంతంగా దీన్ని చెప్పాలి. ఓపక్క కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి.. నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్ గా.. బలుపుగా వ్యవహరిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకునే తీరు చూసినప్పుడు నోట మాట రాదంతే. ప్రకాశం జిల్లా ముఖ్యపట్టణమైన ఒంగోలులోని ఒక బిర్యానీ పాయింట్ వ్యవహారం స్థానికంగా సంచలనంగా మారటమే కాదు.. సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.

ఒంగోలు పట్టణానికి చెందిన ఒక వ్యక్తి  ‘‘బిలాల్ బిర్యానీ పాయింట్’’కు వెళ్లాడు. ఒక పార్శిల్ కు ఆర్డర్ చెప్పాడు. అక్కడే నిలబడ్డాడు. కరోనా కేసులు పెరిగిపోతున్న  నేపథ్యంలో.. ఆ హోటల్ లోని వారెవరూ ముఖానికి మాస్కులు పెట్టుకోకపోవటం.. శుభ్రత విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవటం కనిపించింది. అంతేకాదు.. పని వాళ్ల చెమట బిర్యానీలో పడుతున్న వైనాన్ని గుర్తించి షాక్ తిన్నాడు. కనీస జాగ్రత్తలు తీసుకోరా? పనోళ్ల చెమట నీళ్లు బిర్యానీలో పడుతున్నాయి? అని ప్రశ్నిస్తే.. చెమట పడితే.. బిర్యానీ రుచి పెరుగుతుందని అడ్డదిడ్డంగా మాట్లాడటంతో అవాక్కు అయ్యాడు.

మరీ ఇంత ఆరాచకమా? అంటూ.. అక్కడి పరిస్థితిని తెలియజేస్తూ ఒక వీడియో తీయసాగాడు. దీన్ని గమనించి..ఆ బిర్యానీ పాయింట్ వారు మరింత రెచ్చిపోతూ.. ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని తీసుకో.. ఏమీ చేయలేవంటూ ఫైర్ కావటంతో తన డబ్బులు తాను తీసుకొని వచ్చేశాడు. అనంతరం.. తానుతీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు.

దీంతో.. ఈ వీడియో ఒంగోలు పట్టణ ఫుడ్ సేఫ్టీ అధికారుల వరకు వెళ్లింది. వెంటనే స్పందించిన వారు బిలాల్ బిర్యానీ పాయింట్ లో తనిఖీలు చేపట్టారు. నాన్ వెజ్ పదార్థాలకు నిషేధిత రంగులు వాడుతున్నట్లుగా గుర్తించి.. చర్యలు తీసుకున్నారు. కరోనావేళ.. మీరు తినే ఆహారాన్ని తయారు చేసే ప్రాంతాలు ఎలా ఉన్నాయన్నది జాగ్రత్తగా గమనించటం అస్సలు మిస్ కావొద్దు.
Tags:    

Similar News