దేశమంతా రెండువారాలు షట్ డౌన్

Update: 2022-06-21 09:30 GMT
అప్పట్లో కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలతో పాటు శ్రీలంకలో కూడా లాక్ డౌన్ విధించారు. అయితే ఇపుడు దానికి అదనంగా ఆర్ధిక కారణాల వల్ల షట్ డౌన్ ప్రకటించారు. శ్రీలంక 70 ఏళ్ళ స్వాతంత్ర్యంలో దేశమంతా షట్ డౌన్ విధించడం ఇదే ప్రథమం.

ఆర్ధికంగా దేశపరిస్ధితి దిగజారిపోవటంతో పరిస్థితులన్నీ అస్తవ్యస్ధంగా మారిపోయింది. దాంతో చేసేది లేక ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప మిగిలిన అన్నీ సర్వీసులను, విభాగాలను, రంగాలను ప్రభుత్వం రెండు వారాల పాటు షట్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది.

దేశం మొత్తం మీద విద్యారంగం, వర్తక, వ్యాపార, టూరిజం లాంటి అన్ని రంగాలను రెండు వారాల పాటు మూసేస్తున్నట్లు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రకటించారు. మెడికల్, ఎమర్జెనీ, నౌకా వ్యాపారాలు మినహా మిగిలిన సర్వీసులు పనిచేయడం లేదని ప్రకటనలో అధ్యక్షుడు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొన్నింటిని మాత్రం నామమాత్రపు సిబ్బందితో నడుపుతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం కిలోమీటర్ల కొద్దీ వాహనాలు ఇంకా బారులు తీరుతునే ఉన్నాయి.

హోటళ్ళ వ్యాపారం దాదాపు మూతపడిపోయింది. ఎందుకంటే వాణిజ్య సిలిండర్ ధర సుమారు 6 వేల రూపాయలు దాటిపోయింది. ఇంట్లో వాడుకునే సిలిండర్ ధర 1500 రూపాయలు, పెట్రోల్, డీజల్ ధరలు లీటరుకు 500 రూపాయలు దాటిపోయింది. కేజీ పాల ప్యాకెట్ ధర 1500 రూపాయలు. ఇలా ఏది కొనాలన్నా ధరలు చుక్కలంటున్నాయి. ఎగువ, మధ్య తరగతి కుటుంబాలు మూడు పూటలా భోజనం చేసి నెలలైపోతోందట. దేశంలో ఆర్ధిక సంక్షోభం రోజురోజుకు పెరిగిపోవటంతో దేశంలో అరాచకం మొదలైపోయింది. దాంతో జనాలంతా అధ్యక్ష, ప్రధానమంత్రి, మంత్రుల వెంటపడి తరుముతున్నారు.

గడచిన నాలుగు నెలలుగా దేశంలో ఎన్నో అలజడులు జరుగుతున్నాయి. ఆందోళనల దెబ్బకు ప్రధానమంత్రి రాజీనామా చేశారు. కొందరు మంత్రులు కూడా రాజీనామాలు సమర్పించారు. ఒక ఎంపీని ఆందోళనకారులు దాడులు చేసి చంపేశారు.

మరో ఎంపీ ఆందోళనల దెబ్బకు గుండెపోటుతో చనిపోయారు. ఒక మంత్రి ఇంటి మీద దాడిచేయటంతో ఆయన కూడా చనిపోయారు. అధ్యక్ష భవనంలో ఎంట్రీ పాయింట్లను ఆందోళనకారులు ముట్టడిస్తున్నారు. ఇప్పటికే రెండు ఎంట్రీ పాయింట్లు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. శ్రీలంకలో పరిస్ధితులు ఎప్పటికి సర్దుకుంటాయో ఏమో.
Tags:    

Similar News