గంగిరెడ్డిని ఎన్ కౌంటర్ చేస్తారా?

Update: 2015-11-21 09:33 GMT
ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని వెతికి వెంటాడి ఏపీకి రప్పించిన పోలీసులు విచారణ ప్రారంభించి ఆయన నుంచి కీలక సమాచారాన్ని రాబడుతున్న సంగతి తెలిసిందే. అయితే.. గంగిరెడ్డి భార్య మాళవిక మాత్రం తన భర్తకు ప్రాణహాని ఉందని.. ఆయన్ను ఎన్ కౌంటర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆయన్ను చంపేస్తారేమోనని తనకు భయంగా ఉందని... ఆయన్ను కాపాడాలని కోరింది. తన భర్తకు ఎలాంటి హాని జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

అంతేకాదు... తన భర్తను చంద్రబాబు టార్గెట్ చేశారని.. అందుకే పోలీసులు ఆయన్ను వెంటాడి వేధించారని... అసలు గంగిరెడ్డి ఎక్కడికీ పారిపోలేదని మాళవిక చెబుతున్నారు. గంగిరెడ్డి దుబాయి వెళ్లాడని... దాన్ని దేశం విడిచి పారిపోవడంగా చిత్రీకరించి వెంటాడారని ఆమె అంటున్నారు. దీంతో చంద్రబాబు వల్ల గంగిరెడ్డికి ప్రాణహాని ఉందంటూ గతంలో గవర్నరుకు లేఖ కూడా ఇచ్చామని.. ఆ కోపంతో మరింతగా ఇబ్బందులు పెడుతున్నారని మాళవిక ఆరోపిస్తున్నారు.  తన భర్తను ఎన్ కౌంటర్ చేస్తారేమోనని ఆమె ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కోర్టులనే పూర్తిగా నమ్ముకుని, వారిపైనే నమ్మకం ఉంచుతున్నానని మాళవిక అంటున్నారు. అయితే గంగిరెడ్డిని రాష్ట్రానికి తెచ్చి సుమారు వారం రోజుల తరువాత ఆయన భార్య మీడియా ముందుకు రావడంపైనా వ్యూహం ఏమైనా ఉందా అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. గంగిరెడ్డిని కోర్టులో హాజరుపరిచన తరువాత ఎన్ కౌంటర్ చేస్తారని అనుమానించడంలో అర్థం లేదన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి మాళవిక మీడియా ముందుకు రావడంతో గంగిరెడ్డి కేసు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Tags:    

Similar News