చంద్రబాబు సూచనతోనే వెనక్కుతగ్గారా?

Update: 2018-05-27 09:01 GMT
తిరుమల వివాదం టీడీపీ ప్రతిష్ఠను దిగజార్చుతోంది. ఆరోపణలపై దర్యాప్తు చేయించి తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సింది పోయి ఆరోపణలు చేస్తున్న మాజీ ప్రధానార్చకుడిపై నోటి దురుసుతనం చూపిస్తున్న టీడీపీ నేతలు ఇప్పుడు డిఫెన్సులో పడుతున్నారు. నిన్న రమణ దీక్షితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి తాజాగా తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. దీక్షితులను నాలుగు తన్ని బొక్కలో వేయాలని అనడంపై బ్రాహ్మణ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్లు కూడా సోమిరెడ్డి వ్యాఖ్యలను తప్పు పట్టినట్లు సమాచారం. ఈ క్రమంలోనే చంద్రబాబు సూచన మేరకు ఆయన వెనక్కి తగ్గినట్లు సమాచారం.

    సోమిరెడ్డి అహంకార పూరిత వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోమిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్ళంతా సోమిరెడ్డి మీద, చంద్రబాబు మీద, టీడీపీ మీద మండిపడ్డారు. సోషల్ మీడియాలో అయితే దుమ్మెత్తిపోశారు. ఇంత వ్యతిరేకత వస్తుందని ఊహించని టీడీపీ నేతలు నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిందేనని నిర్ణయించి సోమిరెడ్డితో వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్లు ప్రకటన చేయించారు.

    తాను ఆగ్రహంలో పొరపాటున నోరు జారానని.. వాటిని వెనక్కు తీసుకుంటున్నానని ప్రకటించిన సోమిరెడ్డి.. రమణ దీక్షితులు బీజేపీ కనుసన్నల్లో పనిచేయడం మాత్రం కరెక్టు కాదన్నారు. వెంకటేశ్వరస్వామికి ఒక కులం వారే కాకుండా అన్ని కులాల వారు భక్తులున్నారన్నారు. చంద్రబాబు ఇంట్లో శ్రీవారి నగలు ఉన్నాయని ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం కరెక్టు కాదని ఆయన అన్నారు.
Tags:    

Similar News