అల్లుడు గారు రెడీ : త్వరలోనే రాబర్ట్ వాద్రా రాజకీయ ప్రవేశం....?

Update: 2022-07-21 13:30 GMT
కాంగ్రెస్ అంటేనే పక్కా  వారసత్వ పార్టీ. ముత్తాతల నుంచి కూడా ఆ పార్టీలో వరసబెట్టి నాయకులు అలాగే వచ్చారు. ప్రస్తుతం లెక్కలు చూస్తే కాంగ్రెస్ లో నెహ్రూ ఫ్యామిలీకి సంబంధించి అయిదవ తరం వారసులు పార్టీని శాసిస్తున్నారు. ఆ ఇంట అడుగిడిన కోడళ్ళు రాజకీయాల్లోకి ప్రవేశించి రాణించారు. అలా చూసుకుంటే ఇందిరాగాంధీ రెండవ కుమారుడు సంజయ్ గాంధీ భార్య మేనకాగాంధీ పలు మార్లు ఎంపీ అయ్యారు, కేంద్రంలో మంత్రి కూడా అయ్యారు. ఆమె కుమారుడు వరుణ్ గాంధీ కూడా రాజకీయాల్లో ఉన్నారు.

ఇక పెద్ద కొడుకు రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. ఆయన మరణాంతరం పార్టీ పగ్గాలు పెద్ద కోడలు  సోనియా గాంధీ తీసుకున్నారు. ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ లో కీలకంగా ఉన్నారు. కుమార్తె ప్రియాంకా గాంధీ కూడా మరో వైపు వారసత్వాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఇపుడు ఆమె భర్త సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కూడా రాజకీయాల్లోకి రావాలన్న తన ఆసక్తిని కనబరుస్తున్నారు.

నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోనియాగాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించడంపై ఆమె అల్లుడు రాబర్ట్ వాద్రా ఫైర్ అవుతున్నారు. ఇదంతా కేంద్రంలోని బీజేపీ పెద్దలు కావాలనే చేస్తున్నారు అని కూడా ఆయన ఆరోపించారు. ఇలాంటి పెడ ధోరణులను అడ్డుకునేందుకు పోరాడేందుకు అ అవసరమైతే తాను  రాజకీయాల్లోకి వస్తానని సూచనాప్రాయంగా రాబర్ట్ వాద్రా ప్రకటించడం ఈ సందర్భంగా  విశేషం.

దేశంలోని దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని రాబర్ట్ వాద్రా విమర్శలు చేశారు. ఇవే దర్యాప్తు  సంస్థలు ఏ బీజేపీ నాయకుడిని అయినా విచారణకు పిలిచాయా  అని రాబర్ట్ వాద్రా లాజిక్ పాయింట్ లాగుతున్నారు. దేశంలో తమ రాజకీయ  పరపతి తగ్గుతోందని గ్రహించడం వల్లనే బీజేపీ గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుందని ఆయన మండిపడ్డారు

ఈ దేశంలోని ప్రజలు మార్పుని కోరుకుంటున్నారని అలాంటి నేపధ్యంలో తన వల్ల ఏమైనా సాధ్యపడుతుందని భావిస్తే కచ్చితంగా తాను రాజ్కీయాల్లోకి వస్తాను అని రాబర్ట్ వాద్రా చెప్పడం విశెషంగానే చూడాలి. తనను కూడా పదిహేను సార్లు ఈడీ ప్రశ్నించింది అని రాబర్ట్ వాద్రా చెప్పుకున్నారు. తాను 23 వేలకు పైగా డాక్యుమెంట్స్ కూడా ఈడీకి సమర్పించానని ఆయన అన్నారు. దర్య్పాతు సంస్థలతో ఎలా వ్యవహరించారో తన అత్త అయిన సోనియా గాంధీకు తాను సలహా ఇచ్చానని ఆయన అన్నారు.

తాను ఈడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఆందోళనలో పాల్గొనడంలేదని ఆయన చెప్పారు. అందరూ అరెస్ట్ అయితే బయటకు వచ్చి మాట్లాడేవారు ఉండాలి కదా అని ఆయన అనడం విశెషం. ఇక దేశంలోని వ్యాపారులు ఈ రోజుల్లో ఆదాయపు పన్ను శాఖ కంటే కూడా ఈడీ నుంచే నోటీసులు అందుకుంటున్నారని ఆయన అన్నారు.

జీఎస్టీ వల్ల దేశ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, ప్రజలలో అసంతృప్తి ఉందని ఈ సమయంలో ఈడీ సోనియాను ప్రశ్నించడం రాజకీయ వ్యూహంగానే చూడాలని అన్నారు. మొత్తానికి గతం కంటే సౌండ్ పెంచిన రాబర్ట్ వాద్రా కచ్చితంగా తన అత్త గారి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తాను అని సంకేతాలు ఇచ్చేశారు. బావ రాహుల్ కి తోడు గా భార్య ప్రియాంకా గాంధీకి అండగా రాబర్ట్ వాద్రా తొందరలోనే రాజకీయ అరంగేట్రం చేస్తారనే అంటున్నారు.
Tags:    

Similar News