శ్రీ‌కాకుళం వార్త : మంత్రి సీదిరి జిల్లాలో కొత్త స‌మ‌స్య‌లు ? వేటాడు..వెంటాడు

Update: 2022-04-30 02:49 GMT
కొన్ని నిబంధ‌న‌ల కార‌ణంగా మ‌త్స్య‌కార గ్రామాల్లో చీక‌ట్లను చూడాలి. వెలుగుల‌ను ఎందుకు ప్ర‌భుత్వం తీసుకుని రావ‌డం లేదు అని ఆరా తీయాలి. వారి ఆవేద‌న‌కు కార‌ణం వెత‌కాలి. సమ‌స్య ప‌రిష్కారానికి దారులు వెత‌కాలి. ప్ర‌భుత్వం స్పందిస్తే ఈ ఇళ్ల‌ల్లో కాస్త ఆనందాలు విర‌బూస్తాయి. బెస్త‌వాడ‌ల్లో  తిండి గింజ‌లు దొరుకుతాయి. ఐదు ల‌క్ష‌ల మంది మ‌త్స్య‌కారుల జీవితాల‌ను ప్ర‌భావితం చేసే విధంగా నిబంధ‌న‌ల్లో మార్పులు రావాలి. ఏటా ఇచ్చే ప‌దివేలు కూడా ఏమంత పెద్ద మొత్తం కాదు కానీ ఉన్నంత‌లో బ‌తికేందుకు ఓ భ‌రోసా.. మ‌రి! మ‌త్స్య‌కార భ‌రోసా ఎందుక‌ని అంద‌డం లేదు. గ‌త ఏడాది మే 18 నాటికి ఈ ప‌థ‌కం కింద నిర్దేశించిన మొత్తాల‌ను ల‌బ్ధిదారుల ఖాతాల్లో నేరుగా వేసి సీఎం త‌న మాట నిల‌బెట్టుకున్నారు. మ‌రి !ఈ సారి !

ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వ‌ర‌కూ అమ‌ల‌య్యే వేట విరామంలో వీరి బ‌తుక్కు భ‌రోసా సాధ్య‌మేనా ?

2021 నాటి వివ‌రం ప్ర‌కారం..
 
"ఈ పథకం కింద 1,19,875 కుటుంబాలకు రూ.10వేల చొప్పున అందించారు. త‌ద్వారా రూ.119,87,50,000 మేర లబ్ధి కలిగింది. గడచిన రెండేళ్లలో రూ.211.71 కోట్ల మేర అందించారు. ఈ ఏడాది మరో రూ.119.87 కోట్లతో కలిపి మూడేళ్లలో రూ.331.58 కోట్ల మేర లబ్ధి చేకూరుతోంది.." అని ప్ర‌ధాన మీడియా ద్వారా గ‌త ఏడాది ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. కానీ ఇప్పుడు ఇంకా ప్ర‌తిపాద‌న ద‌శ‌ల్లోనే ఉంది. మ‌రి ! అమ‌లు ?

వివాదాలకు కేరాఫ్ గా నిలిచి వార్త‌ల్లో ఉండే వ్య‌క్తి మంత్రి సీదిరి. ఓ సాదా సీదా కుటుంబానికి చెందిన ఇంకా చెప్పాలంటే మ‌త్స్య‌కార కుటుంబానికి చెందిన ఆయ‌న‌కు వాళ్ల క‌ష్టాలు తెలుసు. క‌న్నీళ్లు తెలుసు ఎందుక‌ని తుడ‌వ‌లేక‌పోతున్నారు. ఇదే ప్ర‌ధానం అయిన స‌మ‌స్య‌. వేట లేని రోజులు ఇంకా చెప్పాలంటే నిబంధ‌న‌లు అనుస‌రించి ఏటా వేట విరామం ప్ర‌క‌టించే రోజుల్లో స‌ర్కారు అందించే సాయం పై ఇప్పుడు  ఎందుకు నీలి నీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. మాటలు, హామీలు..ఇవి నీటిరాత‌లుగా ఎందుక‌ని మిగిలిపోతున్నాయి అన్న‌దే ఇవాళ అంతుప‌ట్ట‌ని ప్ర‌శ్న.

గంగ పుత్రులకు వేటాడితేనే బువ్వ ద‌క్కేది కానీ వేట ఒక జీవ‌న ప్ర‌మాణం పెంపుద‌ల‌కు కాకుండా ఓ భుక్తికి ఆన‌వాలుగా మారిపోయింది.అయినా కూడా తిండి గింజ‌లు దొర‌క‌డం లేదు. ఏటా ఇచ్చే వేట విరామం మ‌త్స్య‌కారులకు ఓ విధంగా శాప‌మే ! శ్రీ‌కాకుళం జిల్లాలో సుదీర్ఘ తీరం ఉన్నా కూడా ఏటా వ‌చ్చే బ‌లీయ‌మైన తుఫానుల కార‌ణంగా వీరు పొందే న‌ష్టం ద‌గ్గ‌ర ప్ర‌భుత్వం ఇచ్చే  సాయం ఏమీ కాదు. అయినా కూడా క‌డ‌లికి ఎదురేగుతూ జీవితాన్ని సాగిస్తున్నారు. మ‌రి! లీన్ మంత్స్ పేరిట ఏడాదిలో మూడు నెల‌లు వారికి వేట ఉండ‌దు. తిండి ఉండ‌దు. తిండి గింజ‌లు దొరక‌పుచ్చుకోవాలంటే స‌ర్కారు సాయం త‌ప్ప‌ని స‌రి.

జీవన భృతి పేరిట ఏడాదికి ప‌దివేలు ఇస్తుంది వైసీపీ సర్కారు. రెండేళ్లూ ఏ కొర్రీలు లేవు. కానీ ఇప్పుడు కొత్త నిబంధ‌న‌లు పెడుతోంది. వేట విరామ స‌మ‌యంలో స‌ముద్రం మీద‌కు వెళ్ల‌కుండా ఇంటికే ప‌రిమితం అయి ఉన్న కుటుంబాల‌ను ఆదుకోవాల్సిన స‌ర్కారు ఆ సంగ‌తే మ‌రిచిపోయింది. ఇప్పుడు కొత్త‌గా వివ‌రాలు సేకరించిన అధికారులు కొత్త  నిబంధ‌న‌ల పేరిట కొన్ని ష‌ర‌తులు వివ‌రిస్తూ ఉన్నారు. వాటి ప్ర‌కార‌మే అయితే మంత్రి సీదిరి ఇలాకాలో మ‌త్స్య‌కారుల‌కు ద‌క్కేది పెద్ద‌గా ఏమీ ఉండదు.
Tags:    

Similar News