ఎన్నికల బరిలో స్టార్‌ క్రికెటర్‌ భార్య!

Update: 2022-11-15 04:42 GMT
ఎన్నికల్లో క్రికెటర్లు పోటీ చేయడం, గెలుపొందడం కొత్త విషయం ఏమీ కాదు. ఇప్పటికే అజారుద్దీన్, గౌతమ్‌ గంభీర్, మనోజ్‌ తివారీ వంటివారు ఎంపీలుగా గెలుపొందారు. మనోజ్‌ తివారీ పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు.

పార్టీలు కూడా ప్రజాదరణ అధికంగా ఉండే సినీ తారలకు, క్రికెటర్లకు పెద్ద పీట వేస్తున్నాయి. వారికున్న ప్రజాక్షరణ తమ పార్టీలకు లాభం చేకూరుస్తాయని భావిస్తున్నాయి.

తాజాగా గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హిమాచల్‌ ప్రదేశ్‌లో పోలింగ్‌ ముగిసింది. ఇక గుజరాత్‌ అసెంబ్లీకి డిసెంబర్‌ 1, 5న రెండు దశల్లో పోలింగ్‌ జరగనుంది.

ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న బీజేపీ మరోమారు గెలుపు సాధించడానికి ఉవ్విళ్లూరుతోంది. గత 25 ఏళ్ల నుంచి గుజరాత్‌లో బీజేపీనే అధికారంలో ఉంది. ఈసారి బీజేపీ అధికారం సాధించడం అంత సులువు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఓవైపు కాంగ్రెస్, మరోవైపు ఆమ్‌ ఆద్మీ పార్టీలు బీజేపీకి గట్టి పోటీనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మొదట విడత ప్రకటించిన 160 మంది సభ్యుల జాబితాలో ఏకంగా 38 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ఐదుగురు మంత్రులు, స్పీకర్‌ కూడా ఉండటం గమనార్హం.

మొదట విడత బీజేపీ ప్రకటించిన జాబితాలో భారత్‌ క్రికెటర్, స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆమె గుజరాత్‌లో కర్ణి సేన నాయకురాలిగా కూడా ఉన్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు జామ్‌నగర్‌ నార్త్‌ నుంచి సీటు కేటాయించింది. తన భార్య ఎమ్మెల్యేగా తొలిసారి పోటీ చేస్తున్నారని రవీంద్ర జడేజా తెలిపారు. ఆమెది చాలా దయాగుణమని.. అందరికీ సహాయం చేయడంలో ముందుంటుందని వెల్లడించారు. ప్రజలకు మరింత సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చిందన్నారు. తన భార్యను గెలిపించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News