ఆ స్టార్టప్ కంపెనీ మాదిరి ఉద్యోగులకు అన్ని కంపెనీల్లో అలా చేస్తే..?

Update: 2022-05-10 01:30 GMT
ఉద్యోగులకు సంబంధించి కంపెనీలు ఆలోచించే విధానంలో మార్పు వస్తోంది. గతంలో కొన్ని విదేశీ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం చేపట్టే కార్యక్రమాలు వినూత్నంగా ఉండటం చదివే వాళ్లు. మారిన కాలానికి తగ్గట్లుగా కొత్త తరహా వ్యాపారవేత్తలు.. పారిశ్రామికవేత్తలు వస్తున్నారు.

తాజాగా వెలుగు చూసిన ఒక స్టార్టప్ కంపెనీ తన ఉద్యోగుల గురించి ఆలోచించిన తీరు.. వారికి కల్పించిన వసతి గురించి తెలిస్తే వావ్ అనకుండా ఉండలేం. ఈ కంపెనీలో ఉద్యోగులకు కల్పిస్తున్న వసతి.. తమ కంపెనీల్లోనూ అమలు చేస్తే ఎంత బాగుండన్న భావన కలగటం ఖాయం. ఇంతకీ ఆ స్టార్టప్ కంపెనీ ఏం చేసిందంటే?

బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఉన్న వేక్ ఫిట్ అనే సంస్థ.. పరుపులు.. సోఫాల తయారీ రంగంలో ఉంది. ఈ స్టార్టఫ్ కంపెనీ గడిచిన కొంతకాలంగా నిద్రకు సంబంధించిన సమస్యల పరిష్కారం మీద పని చేస్తోంది.

ఈ కంపెనీ సహ వ్యవస్థాపకులుగా వ్యవమరిస్తున్న చైతన్య రామలింగ గౌడ్ తన కంపెనీలో పని చేసే ఉద్యోగులకు ఒక మొయిల్ పంపారు. దీని సారాంశం ఏమంటే.. మధ్యాహ్నం భోజనం అయ్యాక చిన్న కునుకు తీస్తే.. ఉద్యోగులు మరింత ఉత్తేజంతో పని చేస్తారన్న పరిశోధనలకు తగ్గట్లే..తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులు లంచ్ అయ్యాక అరగంట పాటు నిద్ర పోయేందుకు అధికారికంగా అనుమతిని ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.

నాసా పరిశోధన ప్రకారం 26 నిమిషాల పాటు కునుకు తీస్తే 33 శాతం పని తీరు మెరుగుపడుతుందని.. హార్వర్డ్ అధ్యయనం కూడా ఇలాంటి విషయాల్నే చెబుతుందని.. అందుకే తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులకు మధ్యాహ్న భోజనం తర్వాత అరగంట పాటు నిద్ర పోయేందుకు అవకాశం కల్పించాలని తాము నిర్ణయించినట్లు చెప్పారు.

ఉత్తినే నిర్ణయం తీసుకోకుండా.. కంపెనీ ఆఫీసులో న్యాప్ పాడ్స్ తో పాటు.. ప్రత్యేక గదులను కూడా సిద్ధం చేస్తున్నట్లు చెప్పిన చైతన్య రామలింగ గౌడ్ మాటల్ని విన్న తర్వాత.. తాము పని చేసే కంపెనీలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఎంత బాగుండదన్న భావన కలగటం ఖాయం. కాదంటారా?
Tags:    

Similar News