హైకోర్టులకు సుప్రింకోర్టు షాక్

Update: 2021-07-10 07:30 GMT
తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న కొన్ని హైకోర్టులకు సుప్రింకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. అనవసరమైన కేసుల్లో, చిన్న చిన్న విషయాల్లో కూడా ఉన్నతాధికారులను కోర్టుకు పిలిపించటం, గంటల తరబడి వెయిట్ చేయించటం, శిక్షల పేరుతో కోర్టు ప్రాంగణంలోనే గంటల పాటు నిలబెట్టడం మామూలైపోయింది. ఇవే విషయాలను తాజాగా ఉత్తరాఖండ్ హైకోర్టులో జరిగిన వ్యవహారం సందర్భంగా ప్రస్తావించింది.

కొన్ని హైకోర్టులు ప్రభుత్వ అధికార పరిధిలోకి జొరబడుతున్నట్లు తీవ్రంగా ఆక్షేపించింది. కేసుల విచారణ పేరుతో ఉన్నతాధికారులను తమ ముందుకు పిలిపించుకుని గంటల తరబడి నిలబెట్టుకుంటున్న విషయాన్ని తప్పుపట్టింది. తమకు నచ్చినట్లుగా ప్రభుత్వాలు నడుకోవాలని జడ్జీలు అనుకోవటం చాలా తప్పని హితవు చెప్పింది.  శాసనవ్యవస్ధ పరిదిలోకి న్యాయవ్యవస్ధ చొరబడేందుకు లేదని స్పష్టంగా చెప్పింది.

విచారణ పేరుతో ఉన్నతాధికారులను పిలిపించుకోవటం, ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు  చేయటం కొన్ని హైకోర్టులకు బాగా అలవాటైపోయిందని ఆక్షేపించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అసంబద్దంగా ఉందనిపిస్తే వాటిని కొట్టేసే అధికారం ఎలాగూ కొర్టులకుందని గుర్తుచేసింది. అధికారులను పదే పదే పిలిపించి కోర్టుల గౌరవాన్ని తగ్గించింద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చింది.  

ఇతర హైకోర్టుల విషయం ఎలాగున్నా ఏపిలో మాత్రం సుప్రింకోర్టు ఏదైతే వద్దని ఇపుడు చెప్పిందో అదే జరుగుతోంది. ప్రతి చిన్న విషయానికి ఉన్నతాధికారులను పిలిపించుకోవటం గంటల తరబడి నిలబెట్టడం మామూలైపోయింది. ఎవరెవరో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేసి ఉన్నతాధికారులను పార్టీలుగా చేర్చి కేసులు వేస్తున్నారు. వెంటనే కోర్టులు నోటీసులిచ్చి ఉన్నతాధికారులను విచారణకు పిలిపిస్తున్న విషయం అందరు చూస్తున్నదే. విచారణ పేరుతో కొందరు జడ్జీలు ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వంపైన కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఈ వ్యాఖ్యలేవీ తీర్పుల్లో ఉండటంలేదు.

ఈ విషయమై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా సుప్రింకోర్టు కూడా హైకోర్టుల తీరును తప్పపట్టడం గమనార్హం. మరి సుప్రింకోర్టు చెప్పిన తర్వాతైనా హైకోర్టుల తీరు మారుతుందేమో చూడాలి. కొన్ని కేసుల్లో తెలంగాణా హైకోర్టు కూడా ఇలాగే వ్యవహరించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
Tags:    

Similar News