బాబు ద‌మ్ముంటే...మ‌గాడిలా ముందుకు రా

Update: 2018-09-15 14:08 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై మ‌రోమారు టీఆర్ ఎస్‌ పార్టీ శ్రేణులు విరుచుకుప‌డ్డాయి. తెలంగాణ‌లో గెలిచే స్థానాల‌పై త‌న రాష్ట్ర పోలీసుల‌తో బాబు స‌మాచార సేక‌ర‌ణ చేస్తున్నార‌నే వార్త మీడియాలో వ‌చ్చిన నేప‌థ్యంలో టీఆర్ఎస్ వ‌ర్గాలు విరుచుకుప‌డ్డాయి. మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌ యాద‌వ్‌ - ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి - ఎంపీ బాల్క సుమన్  - టీఆర్ ఎస్‌ కార్యదర్శి గట్టు రాంచందర్ రావు తెలంగాణ భవన్‌ లో మీడియాతో మాట్లాడుతూ విరుచుకుప‌డ్డారు. ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్ధంగా చంద్రబాబు కాంగ్రెస్‌ తో జత కడుతున్నారు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. `టీడీపీ - కాంగ్రెస్ పొత్తు ఆరు నెలల క్రితమే కుదిరింది. పొత్తు పర్యవసానాలను చంద్రబాబు రాబోయే రోజుల్లో అనుభవిస్తారు. పొత్తుల మూలంగా తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ లో బాబు భారీ మూల్యం చెల్లించుకుంటారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో డ్రామాలు నడుస్తున్నాయి. చంద్రబాబు చిన్న విషయాన్ని చిలవలు - పలవలు చేస్తున్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు అమిత్‌ షాకు లేదు. కేంద్రంలో అధికార బీజేపీ.. రిజర్వేషన్ల బిల్లును ఎందుకు ఆమోదించలేదు? బీజేపీ ఉన్న ఐదు స్థానాల్లో గెలిస్తే మహా గొప్ప. బీజేపీ - టీడీపీ - కాంగ్రెస్ పార్టీలకు క్యాడర్ లేదు` అని మంత్రి తలసాని ఆరోపించారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చీకటి రాజకీయాలు.. వెన్నుపోటు రాజకీయాలు మానుకోవాలి అని టీఆర్ ఎస్ ఎంపీ బాల్క సుమన్ హెచ్చరించారు. తెలంగాణ రాజకీయాలను కలుషితం చేయాలని చంద్రబాబు చేస్తున్న కుట్రలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. చెన్నూర్ నియోజకవర్గ టీఆర్ ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నక్కజిత్తుల నారాబాబు. ఆంధ్ర ప్రజలకు చెందిన కోట్లాది రూపాయాలు తెచ్చి చంద్రబాబు తెలంగాణలో కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. ఏపీ నుంచి వందల కోట్లను ఇక్కడికి దిగుమతి చేసి గోల్‌ మాల్ చేయాలని చూస్తున్నార‌ని బాల్క సుమ‌న్ ఆరోపించారు. నాలుగు ఓట్లు రాలుతాయనే ఆశతో కుట్రల కాంగ్రెస్‌ తో టీడీపీ జతకట్టింది. ఏపీ పోలీసులు పచ్చ పార్టీ ఏజెంట్లుగా మారారు. ఏదైనా జరగరాని సంఘటన జరిగితే దానికి బాధ్యత చంద్రబాబుదే. తెలంగాణను విఫల రాష్ట్రంగా చిత్రీకరించడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని బాల్క సుమన్ పేర్కొన్నారు.

తెలంగాణలో రాజకీయాలు చేయాలంటే చంద్రబాబు మగాడిలా ముందుకు రావాలి.. కానీ దొంగలా రావొద్దని టీఆర్ ఎస్ నాయకుడు గట్టు రామచంద్రరావు సవాల్ చేశారు. `చంద్రబాబు బతుకంతా దొంగ రాజకీయాలే. బాబు విచ్ఛిన్నకర కుట్రలను ఎదుర్కోవడానికి తెలంగాణ సమాజమంతా రెడీగా ఉంది. చంద్రబాబు తెలివైన దొంగ. తెలంగాణను పాడు చేయడానికి బాబు టీడీపీ ఆఫీసులో డెన్‌ ను ఏర్పాటు చేశాడు. అవినీతితో అడ్డదిడ్డంగా సంపాదించిన ధనంతో తెలంగాణను నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నాడు. టీడీపీ కుట్రలను ఎలా విచ్ఛిన్నం చేయాలో టీఆర్ ఎస్‌ కు తెలుసు.` అంటూ విరుచుకుప‌డ్డారు. `ఇక్కడ ఎలాంటి కుట్రలు చేయాలని చూసినా ఊరుకోం.. తరిమి కొడతాం. ఇక్కడి నుంచి చంద్రబాబు డెన్ తీసేయకుంటే తర్వాత జరిగే పరిణామాలకు మా బాధ్యత లేదు. చంద్రబాబు భయంతో ఒక నోటీస్ పట్టుకొని తిరుగుతున్నాడు. బాబు మీద కేసు కొట్టేయాలని తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రను కోరాలట. చంద్రబాబు చేసిన మోసాలకు జీవిత ఖైదు విధించాలి. తప్పుడు ఆలోచనలతో తెలంగాణలో శిఖండి రాజకీయాలు చేస్తే చంద్రబాబుకు ప్రజలు దిమ్మతిరిగే సమాధానం చెప్తారు. చంద్రబాబు కుట్రలకు కాంగ్రెస్ బాధ్యత వహించాలి. కాంగ్రెస్‌ లో చంద్రబాబు తన కోవర్టులను పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేకుండా చంద్రబాబు చుట్టూ తిరుగుతోంది`` అంటూ విరుచుకుప‌డ్డారు.
Tags:    

Similar News