ఠాగూర్ రిపీట్.. మృతదేహానికి చికిత్స

Update: 2018-09-30 09:02 GMT
చిరంజీవీ హీరోగా నటించిన ‘ఠాగూర్’ సినిమా చూసిన వారందరికీ ఒక్క సీన్ విపరీతంగా నచ్చేస్తుంది. అదే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డబ్బుల కోసం చనిపోయిన శవానికి చికిత్స చేస్తూ నాటకాలాడుతారు. ఈ సీన్ ఆ సినిమాకే హైలెట్. అంతేకాదు.. ప్రస్తుత సమాజంలో చికిత్స పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ  కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమాలో చూపించింది అక్షర సత్యం అని మరోసారి తేటతెల్లమైంది.

తమిళనాడులో ఠాగూర్ సీన్ రిపీట్ అయ్యింది.   నాగపట్నం జిల్లా కీళాయిసానూరుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శేఖర్ (55) అనారోగ్యంతో ఈ నెల 7న ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. ఆరోగ్యం క్షీణించడంతో మరునాడే తంజావూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ముందుగానే రూ.2.50 లక్షలు ఇస్తేనే చికిత్స చేస్తామని ఆస్పత్రి వైద్యులు ముక్కుపిండి మరీ బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశారు. అనంతరం 28వరకూ కూడా శేఖర్ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు శేఖర్ బంధువులు రెడీ అయ్యారు. కానీ చికిత్స చేశామని.. రూ.5 లక్షలు కట్టాలని ఆస్పత్రి యాజమాన్యం పట్టుబట్టింది. దీంతో హామీ పత్రం రాసిచ్చి తంజావూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు మూడురోజుల క్రితమే శేఖర్ చనిపోయాడని నిర్ణారించారు.

దీంతో మోసపోయామాని గ్రహించిన మృతుడి బంధువులు ప్రైవేటు ఆస్పత్రి రూ8 లక్షలు వసూలు చేయడంపై మండిపడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. ఇలా కాసుల కక్కుర్తిలో పడి ప్రాణాలతో సైతం వ్యాపారం చేస్తున్న ఓ ప్రైవేటు ఆస్పత్రి వ్యవహారం తమిళనాట చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News