ఆయనకు మంత్రి యోగం పక్కా... ?

Update: 2021-10-05 14:30 GMT
ఇపుడు ఏపీ రాజకీయాల్లో అమాత్య కుర్చీల మీద అతి పెద్ద చర్చ సాగుతోంది. క్యాబినెట్ లో ఉండేవారు ఎవరు, పోయేవారు ఎవరు అన్న టాపిక్ మీద వాడి వేడిగా డిస్కషన్ అయితే ఉంది. వీటికి తోడు ముహూర్తం కూడా ముంచుకు వస్తోంది. జగన్ పెట్టిన గడువు నవంబర్ ఎనిమిదవ తేదీతో పూర్తి అవుతోంది. అంటే అచ్చంగా నెల రోజులు మాత్రమే ఉందన్న మాట. మరి జగన్ మదిలో ఏముంది. ఎవరున్నారు అన్న దాని మీద వైసీపీలో నేతలంతా మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే తాజాగా సీనియర్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే అసలు గుట్టు విప్పేశారు, నిజం చెప్పేశారు. నూటికి నూరు శాతం మంత్రులను జగన్ మార్చబోతున్నారు అని కూడా బాంబు పేల్చారు. దాంతో మంత్రుల్లో టెన్షన్ మొదలైంతే ఆశావహుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుత మంత్రులలో దాదాపుగా సగానికి పైగా ఉన్న వారి పనితీరు మీద నివేదికలు అధినాయకత్వం వద్ద ఉన్నాయట. ఇక ఉత్తరాంధ్రా జిల్లాలో కొందరు సీనియర్ మంత్రుల మీద కూడా హై కమాండ్ కి అసంతృప్తి ఉందని అంటున్నారు. సరే మొత్తానికి మొత్తం మంత్రులను మారుస్తారా లేక సగానికి పీగా మార్పులు ఉంటాయా అన్నది పక్కన పెడితే శ్రీకాకుళం జిల్లాలో ఒక సీనియర్ నేత అనుచరులు మాత్రం ఈసారి తమ నాయకుడికి మంత్రి పదవి పక్కా అని లెక్కలేసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉప ముఖ్యమంత్రిగా ధర్మాన క్రిష్ణ దాస్ ఉన్నారు. ఆయన రెండున్నరేళ్ల పాలన మీద బాగాలేదనే నివేదికలు ఉన్నాయట. అంతే కాదు ఆయన మెత్తగా ఉంటారు, జిల్లా రాజకీయాలను శాసించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

దాంతో ఆయన్ని తప్పిస్తే కనుక కచ్చితంగా ధర్మాన ప్రసాదరావు మంత్రి అవుతారు అంటున్నరు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ధర్మాన ఫ్యామిలీని దాటి ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు అన్న మాట ఉంది. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో జిల్లాలో పార్టీని ఏకత్రాటిపైన విజయపధాన నడిపించాలి అంటే ప్రసాదరావు లాంటి సమర్ధుడి చేతిలోనే పగ్గాలు ఉంచడం అవసరం అన్న మాట కూడా వినిపిస్తోంది. దాంతో ధర్మాన ప్రసాదరావు గ్యారంటీగా మంత్రి అనేస్తున్నారు ఆయన అనుచరులు. ఇదే విధంగా మరో మంత్రి సీదరి అప్పలరాజు విషయంలో సామాజిక సమీకరణలు గట్టిగా పనిచేస్తున్నాయని అంటున్నారు.

ఇదే జిల్లాకు చెందిన పాలకొండ ఎమ్మెల్యే కళావతికి మంత్రి పదవి ఇస్తే మాత్రం సీదరి మాజీ మంత్రి అవుతారు అంటున్నారు. దాంతో ఆయన వర్గం కొంత డల్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం ఈసారి మంత్రి కావాల్సిందే అని పట్టుదల మీద ఉన్నారు. ఆయన తమ బాధ అంతా జగన్ కి చెప్పుకున్నారు. ఇదే తనకు చివరి అవకాశం అని భావిస్తున్నారు కూడా. దాంతో జగన్ ఆయన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే కుర్చీ ఎక్కడ ష్యూర్ అని కూడా చెబుతున్నారు. మొత్తానికి చూస్తే శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు కనుక మంత్రి అయితే ఆ జిల్లా రాజకీయాలు ఒక్క లెక్కన ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.


Tags:    

Similar News