ఆంధ్రా బాటలో తెలంగాణ..

Update: 2022-12-29 08:30 GMT
కొన్ని విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రా బాటలో వెళ్తోంది. గతంలో ఆంధ్రా ప్రభుత్వంపై, నాయకులపై రకరకాల కామెంట్లు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఏపీ తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన  తరువాత కూడా తెలుగు ప్రజలు ఒక్కటై జీవిస్తున్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం విభిన్న నిర్ణయాలను తీసుకుంటూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి.

అయితే  తెలంగాణలో ప్రవేశపెడుతున్న పథకాలపై ఆంధ్రులు ప్రశంసలు కురిపించారు. అక్కడి పథకాలు ఇక్కడ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే తెలంగాణలోని రైతు బంధు పథకాన్ని.. సీఎం జగన్ రైతు భరోసా ను తీసుకొచ్చారు. దాదాపు ఎక్కువగా తెలంగాణ పథకాలు, నిర్ణయాలను ఏపీ ప్రభుత్వం ఫాలో అవుతుందని చర్చ సాగింది. కానీ తాజాగా  పదో తరగతి పరీక్షలపై  తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రలో అనుసరిస్తున్న విధానాన్ని అనుసరిస్తోంది.

ఇంతకాలం తెలంగాణలో పదోతరగతి పరీక్షలకు 11 పేపర్లు ఉండేవి. కానీ తాజాగా 6 పేపర్లకు కుదించాలని ఆదేశాలు జారీ చేసింది. 2020 వరకు టెన్త్ లో 11 పేపర్లు ఉండేవి. ఆ సమయంలో కరోనా కారణంగా 6 పేపర్లకు కుదించారు. అయితే తరువాత యథావిధిగా 11 పేపర్లు ఉండొచ్చని అనుకున్నారు.

ప్రభుత్వం సైతం ఆ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా పదోతరగతి పరీక్ష్లో 6 పేపర్లే ఉంటాయని తేల్చి చెప్పింది.  ఒక్కో సబ్జెక్టులో 80 మార్కుల పరీక్ష ఉంటుంది. మిగతా 20 మార్కులను ఫార్మెటివ్ అసైన్మెంట్ కు ఇచ్చారు. గతంలో కరోనా కారణంగా 70 శాతం సిలబస్ ను మాత్రమే పూర్తి చేశారు. కానీ ఈసారి 100 శాతం సిలబస్ పూర్తి చేస్తామని మంత్రి సబితారెడ్డి ప్రకటించారు.

పదోతరగతి పరీక్షల విషయంలో గత ఏప్రిల్ లో ఏపీ ప్రభుత్వం ఇదే నిర్ణయాన్ని అనుసరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో విద్యాశాఖ కార్యదర్శి రాజశేఖర్ 6 పేపర్లను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఎస్ఈ సిలబస్ నేపథ్యంలోనే 6 పేపర్ల విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. అయితే ఇక్కడా అంతకుముందు 11 పేపర్లు ఉండగా కరోనా కారణంగా 6 పేపర్లను కుదించారు. ఈ ఏడాది ఏప్రిల్ లో పూర్తిస్థాయిలో 6 పేపర్లు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 2022-23 నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుందని పేర్కొంది.

ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో పదో తరగతి విద్యార్థుల్లో కాస్త ఒత్తిడి తగ్గనుంది. అయితే కొన్ని పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలతో పాటు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ క్రమంలో సౌకర్యాల విషయంలోనూ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News