న‌వ్యాంధ్ర‌కు నాలుగు రాజ‌ధానులు..బీజేపీ క‌ల‌క‌లం

Update: 2019-08-25 10:32 GMT
ఆంధ్రప్రదేశ్ రాజధాని కొద్దిరోజులుగా హాట్ టాపిక్ గా మారింది. వైసీపీకి చెందిన నేతలు రాజధాని విషయంలో చేసిన ప్రకటనతో రాజధాని అంశం ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. వైసిపి సీనియర్ నేత - మంత్రి బొత్స సత్యనారాయణ రాజ‌ధాని గురించి అసంబ‌ద్ధంగా చేసిన‌ వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. దీనిపై ఆదివారం ఆయన క్లారిటీ ఇస్తూ మరోసారి తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. బొత్స వ్యాఖ్యలతో రాజధాని అమరావతి నుంచి దొనకొండ పోతుందని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి.

వైసీపీ నేతలు మాత్రం తమ అధినేత దీనిపై స్పందించే వరకు... ఎలాంటి మాటలు నమ్మాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే నవ్యాంధ్ర రాజధాని విషయంలో బిజెపి నేతలు సైతం స్పందిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అమరావతి గురించి మాట్లాడుతూ రాజధాని మార్పు విషయంలో బిజెపి జోక్యం చేసుకోద‌ని చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు టీడీపీ నుంచి బీజేపీలోకి వలస వెళ్ళిన టి.జి.వెంకటేశ్ మాత్రం రాజధాని విషయంలో లో త‌న వ్యాఖ్య‌ల‌తో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా బాంబు పేల్చారు.

అమ‌రావ‌తిపై ఆశ‌లు వ‌దిలేసుకోవాల్సిందే అని... ప్ర‌త్యామ్నాయ రాజ‌ధానుల‌పై ఇప్ప‌టికే ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి బీజేపీ అధిష్ఠానంతో చర్చించారని చెప్పారు. ఓ ఛానెల్‌ తో ఆయ‌న మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌ కు కుదిపేస్తున్నాయి. ఏపీలో విజయనగరం - గుంటూరు - కాకినాడ - కడప జిల్లాలను రాజధానులుగా ప్రొజెక్టు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ విషయం బీజేపీ అధిష్ఠానమే తమ‌కు చెప్పింద‌న్నారు.

అలాగే పోల‌వ‌రం టెండ‌ర్ల విషయంలోనూ రాష్ట్రం కేంద్రాన్ని సంప్ర‌దించ‌లేద‌న్నారు. పోలవరాన్ని జగన్ నిర్లక్ష్యం చేస్తే చంద్రబాబుకు రాజకీయంగా లైఫ్ ఇచ్చిన వారవుతారని అభిప్రాయపడ్డారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్‌ తో స‌న్నిహితంగా ఉంటోన్న జ‌గ‌న్ ఆయ‌న‌కు ఎంత దూరంగా ఉంటే ఆయ‌న రాజ‌కీయ జీవితానికి అంత మంచిద‌న్నారు. ఏదేమైనా టీజీ వెంక‌టేష్ చేసిన నాలుగు రాజ‌ధానుల కామెంట్లు టోట‌ల్‌గా అంద‌రిని గంద‌ర‌గోళంలో ప‌డేశాయి. మ‌రి దీనిపై జ‌గ‌న్ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేసే వ‌ర‌కు క్లారిటీ వ‌చ్చేలా లేదు.



Tags:    

Similar News