బాబు కలలో కూడా ఊహించని ఆరోపణ చేసిన అన్నాడీఎంకే..

Update: 2018-04-04 17:14 GMT
టీడీపీ, వైసీపీ...  ఈ రెండు పార్టీల పేరు చెప్తే చాలు అవి ఉప్పునిప్పు అని అంటారు ఎవరైనా. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వైసీపీ పేరు వింటేనే పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. కానీ.. విచిత్రంగా దిల్లీలో చంద్రబాబుపై షాకింగ్ ఆరోపణలు వచ్చాయి. వైసీపీతో కలిసి టీడీపీ లోపాయికారీ రాజకీయం నడిపే ప్రయత్నం చేస్తోందని అన్నాడీఎంకే పార్టీ ఆరోపించింది. ఆ పార్టీ నేత  తంబిదురై ఒక చానల్‌ తో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు.
    
తాము పెట్టిన అవిశ్వాసం చర్చకు రాకుండా అన్నాడీఎంకే అడ్డుకుంటోందంటూ టీడీపీ ఆరోపణలు చేస్తుండడంతో తంబిదురై ఈ విధంగా మండిపడ్డారు. తాము అవిశ్వాసానికి అడ్డుపడడం లేదని.. అలాంటి అవసరం తమకు లేదని.. తమ సమస్యలను తాము ప్రస్తావిస్తున్నామని అన్నారు. కావేరి జలాల వివాదం నాలుగు రాష్ట్రాలకు సంబంధించిందని.. దాన్ని ప్రస్తావిస్తుంటే టీడీపీ ఇలా విమర్శలు చేయడం కరెక్టు కాదని అయన అన్నారు. అంతేకాదు... అసలు టీడీపీకి దీనిపై చిత్తశుద్ధిలేదని.. వైసీపీ అవిశ్వాసతీర్మానం ఇచ్చిన తర్వాత టీడీపీ అవిశ్వాసతీర్మానం ఇచ్చిందని గుర్తు చేశారు.
    
టీడీపీ రాజకీయ గేమ్ ఆడుతోందని.. వైసీపీతో అంతర్గత ఒప్పందం మేరకే ఇలా చేస్తోందని ఆయన ఆరోపించారు. ఏపీ రాజకీయాలతో తమకు సంబంధం లేదని.. తమ రాష్ట్ర సమస్య కోసం తాము పోరాడుతున్నామని ఆయన అన్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. వైసీపీతో కలిసి లోపాయికారీగా టీడీపీ ఇలా చేస్తోందని అన్నాడీఎంకే అనడాన్ని టీడీపీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారట.
Tags:    

Similar News