అరుదైన నిర్ణయాన్ని తీసుకున్న ఆ హైకోర్టు.. బిడ్డను కనేందుకు జీవితఖైదుకు అనుమతి

Update: 2022-04-23 01:32 GMT
ఒక నేరం చేసి దోషిగా కోర్టు తేల్చి.. అతనికి జీవిత ఖైదు శిక్ష వేసింది. సదరు ఖైదీ భార్య కోర్టును ఆశ్రయించి.. తన వైవాహిక జీవితానికి గుర్తుగా పిల్లల్ని కనే హక్కులో భాగంగా జైల్లో దోషిగా శిక్ష అనుభవిస్తున్న భర్తకు పెరోల్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించింది. అందుకు ఓకే చెప్పిన అరుదైన ఉదంతం రాజస్థాన్ హైకోర్టులో చోటు చేసుకుంది.

వాస్తవానికి ఈ నిర్ణయాన్ని ఈ నెల మొదటివారంలో వెలువరించగా.. తాజాగా ఈ వార్తబాహ్య ప్రపంచానికి తెలిసింది. అరుదైన ఆదేశంగా చెబుతున్న ఈ హైకోర్టు తీర్పు ఇప్పుడు పెద్ద చర్చకు తెర తీసింది. అదే సమయంలో సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే.. రాజస్థాన్ కు చెందిన నంద్ లాల్ అనే వ్యక్తి ఒక కేసులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్నాడు.

2009లో ఆయనకు రాజస్థాన్ లోని బిల్వారా కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది.  ఈ క్రమంలో తనకు 15 రోజుల పాటు పెరోల్ మంజూరు చేయాలని అజ్మీర్ జిల్లా కమిటీకి దరఖాస్తు చేసుకోగా.. అందుకు జిల్లా కమిటీ నో చెప్పేస్తూ పెరోల్ పిటీషన్ ను కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. సంతానం పొందేందుకు తనకున్న హక్కును ఆమె తెర మీదకు తీసుకొచ్చారు.


తనకున్న హక్కును వినియోగించుకోవటానికి తన భర్తను విడుదల చేయాలని నంద్ లాల్ సతీమణి రేఖ కోరారు. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన జస్టిస్ సందీప్ మెహతా.. జస్టిస్ ఫర్జాంద్ అలీల ధర్మానసం అరుదైన ఆదేశాల్ని జారీ చేసింది. నంద్ లాల్ భార్య అమాయకురాలని.. భర్త జైలుశిక్ష కారణంగా ఆమె వైవాహిక జీవితంతో ముడిపడ్డ శృంగార.. భావోద్వేగ అవసరాలు ఆమెకు దూరమైన నేపథ్యంలో సంతానం పొందే హక్కు ఖైదీకి ఉంటుందని పేర్కొన్నారు.

అయితే.. అన్ని కేసుల్లో ఇదే తీర్పు అమలు కాదన్న విషయాన్ని పేర్కొంటూ.. ఆయా కేసుల్లో వాస్తవాలు.. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఆధారపడి ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది.    సంతానం కోసం దాంపత్య సంబంధాలను కలిగి ఉండటంతో పాటు దోషి సాధారణ స్థితికి తీసుకురావటానికి.. అతని ప్రవర్తనను మార్చేందుకు తమ ఆదేశం సాయం చేస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఒకవేళ ఈ పిటీషన్ ను రిజెక్టు చేయటం ద్వారా ఆమె హక్కులను ప్రభావితం చేస్తుందని చెబుతూ పెరోల్ కోసం రూ.25వేల చొప్పున రెండు పూచీకత్తులతో పాటు రూ.50వేల వ్యక్తిగత బాండ్ పై లాల్ ను విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ అరుదైన ఆదేశం ఇప్పుడు వైరల్ గా మారింది. ఏమైనా ఇటీవల కాలంలో హైకోర్టులు ఇస్తున్న కొన్ని ఆదేశాలు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి.
Tags:    

Similar News