నోటీసుల ఎపిసోడ్ ను మాజీ ప్రధాని సతీమణి వరకు తెచ్చారు

Update: 2022-03-29 04:05 GMT
మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నంతనే రెండు విషయాలు వెంటనే గుర్తుకు వచ్చాయి అందరికి. అందులో మొదటిది పెట్రోల్.. డీజిల్ ధరల్ని భారీగా పెంచేయటం అయితే.. మోడీ హయాంలో వాళ్లకు వీళ్లకు అన్నతేడా లేకుండా నోటీసులు జారీ చేయటం. అదేం విచిత్రమో కానీ.. మోడీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా కమలనాథులపై కత్తి కట్టిన రాజకీయ నేతలందరికి నోటీసులు వచ్చేయటం తెలిసిందే.

ఈ విషయంలో ఏమైనా మినహాయింపు ఉందంటే అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని చెప్పాలి. గడిచిన కొద్ది కాలంగా ప్రధాని మోడీపై ఒంటికాలిపై విరుచుకుపడుతున్న ఆయన.. నోటీసులు.. జైలు అంటే మాటలనుకుంటున్నారా? అందులోకి కేసీఆర్ ను టచ్ చేసే దమ్ముందా? అంటూ మిగిలిన వారికి భిన్నంగా రియాక్టు అవుతున్న వైనం చూసినోళ్లంతా విస్మయానికి గురవుతున్నారు. మోడీషాల మీద ఈ స్థాయిలో విరుచుకుపడటం.. అయినప్పటికీ కేసీఆర్ కు ఎలాంటి నోటీసులు రాకపోవటం హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా ఉంటే.. తాజాగా మాజీ ప్రధాని హెచ్ డీ దేవగౌడ సతీమణి చెన్నమ్మకు ఆదాయపన్ను శాఖ వారు నోటీసులు జారీ చేసిన వైనం కలకలాన్ని రేపుతోంది. ఆమె ఆస్తికి సంబంధించి ఐటీ శాఖ ఇచ్చిన నోటీసు రాజకీయ రచ్చకు కారణంగా మారింది. ఈ అంశంపై దేవగౌడ కుమారుడు కర్ణాటక మాజీ మంత్రి రేవన్న తాజాగా రియాక్టు అయ్యారు. ఇప్పుడు తమ తల్లికి  నోటీసులు ఇచ్చారని.. తమ భూమిలో చెరుకును పండిస్తున్నామని.. కావాలంటే అధికారులు వచ్చి చూడాలన్నారు.

ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది మాజీ ప్రధానమంత్రి సతీమణికి అని.. ఆ విధంగా చేయకూడదని తాను చెప్పనని.. ప్రతి ఎకరా భూమిలో తాము ఎలాంటి పంట పండిస్తున్నామో అధికారులు వచ్చి చూస్తే బాగుంటుందన్నారు. ఇదిలా ఉంటే.. రేవన్న వ్యాఖ్యలకు భిన్నంగా రియాక్టు అయ్యారు దేవగౌడ కుమారుడు కమ్ మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి. తన తల్లికి నోటీసు వచ్చినట్లుగా తనకు ఎలాంటి సమాచారం లేదని.. ఒకవేళ నోటీసులు వచ్చి ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

తమ కుటుంబంలో జరిగే ఏ పని అయినా అందరికి తెలిసే జరుగుతుందని.. దాపరికాలు ఉండవన్నారు. నోటీసులు పంపితే.. అందుకు తగిన సమాధానం ఇస్తామన్న ఆయన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

60 ఏళ్ల దేవగౌడ రాజకీయ జీవితంలో ఎప్పుడూ డబ్బుకు తాము ప్రాధాన్యం ఇవ్వలేదని.. ఇప్పుడు కూడా అంతేనన్న కుమారస్వామి మాటలు బాగానే ఉన్నా.. ఇంతకీ ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందా? లేదా? అన్న దానిపై మాత్రం క్లారిటీ రాని పరిస్థితి. ఈ విషయం మీద ఐటీ శాఖ క్లారిటీ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News