మునుగోడు లో గేర్ మార్చేసిన పార్టీ ...ముందస్తు సిగ్నల్స్...?

Update: 2022-10-30 03:30 GMT
మునుగోడు ఉప ఎన్నిక. తెలంగాణాలో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయనగా వచ్చిపడిన ఎన్నిక. ఈ ఉప ఎన్నిక గేం చేంజర్ గా ఉంటుందని, తెలంగాణా రాజకీయాన్ని మొత్తం మార్చేస్తుందని ఆదిలో అంతా అనుకున్నారు. బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే గట్టి అభ్యర్ధి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పవర్ ఫుల్ గా సై అంటూ బరిలోకి దిగారు. అధికార టీయారెస్ కి ఒక దశలో చుక్కలు చూపించారు. మునుగోడు ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఒక మీడియా అధిపతిని, అలాగే ఒక టాలీవుడ్ సూపర్ స్టార్ ని కలసి తెలుగు రాజకీయాలలో కొత్త మసాలాని బాగా  దట్టించారు.

ఆ తరువాత నోటిఫికేషన్ వరకూ బీజేపీ హవా సాగుతూ వచ్చింది. ఇక కాంగ్రెస్ క్యాండిడేట్ ని రెడీ చేసుకుని అందరి కంటే ముందే బరిలోకి దిగింది. సరిగ్గా మునుగోడు ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ భారత్ జోడీ యాత్ర తెలంగాణా గడ్డ మీదుగా సాగడం కూడా విశేషం. దాంతో కాంగ్రెస్ గ్రాఫ్ కూడా బాగానే పెరిగింది అంటున్నారు.

అధికారంలో ఉండడం, మునుగోడుని ఒకసారి గెలుచుకోవడంతో పాటు, అక్కడ బలంగా ఉన్న వామపక్షాలను ముందే మిత్రులుగా చేసుకోవడం ద్వారా గులాబీ పార్టీ పటిష్టంగా మారింది. అదే టైం లో వచ్చిన వారిని వచ్చినట్లుగా కండువాలు కప్పేసి తమ వైపునకు తిప్పేసుకుంది. సరిగ్గా ఈ టైం లో ఫాం హౌస్ లో ఆపరేషన్ టీయారెస్ ఎమ్మెల్యేస్ అన్న ఎపిసోడ్ జరిగింది.

ఇందులో బీజేపీకి నేరుగా కనెక్షన్ ఉంది అని నిరూపించే ఆధారాలు అయితే ఇప్పటికి నేరుగా  లేకపోయినా ఈ ఆపరేషన్ వల్ల జరిగిన చర్చ, రచ్చ అంతా కూడా అధికార టీయారెస్ కి బాగానే మైలేజ్ తెచ్చాయని అంటున్నారు. అదే టైం లో స్వాజీజీలు, సాధు సంతులు కొనుగోళ్ల ఆపరేషన్ లో పాలుపంచుకుంటారా అన్న ప్రశ్నలు ఉన్నాయి. అది వేరే విషయం కానీ వారు తమ పార్టీకి చెందిన వారు కాదని బీజేపీ గట్టిగా చెబుతోంది కానీ ఈ ఇష్యూలో బీజేపీ మాత్రం కొంత ట్రబుల్ లో పడినట్లు అయింది అంటున్నారు.

మునుగోడు ఎన్నికకు ఇంకా నాలుగు రోజులు గట్టిగా ఉన్న వేళ ఎన్నికల చిత్రం ఇపుడు ఆసక్తిగా మారింది. టీయారెస్ లో టెన్షన్ బదులుగా హుషార్ కనిపిస్తోంది అంటున్నారు. మునుగోడులో ఈ నెల 31న భారీ బహిరంగ సభ నిర్వహించి లాస్ట్ పంచ్ తనదే అని టీయారెస్ అధినేత కేసీయార్ చాటబోతున్నారు అని అంటున్నారు.

మునుగోడులో విజయం  సాధిస్తే ఒక్క తెలంగాణాలోనే కాదు దేశ రాజకీయాలను కీలక  మలుపు తిప్పాలని కేసీయార్ చూస్తున్నారు. బీయారీస్ ఆవిర్భావ సభను ఏకంగా  బీజేపీ కోటలోనే పెట్టాలని  చూస్తున్నారుట. ఇక మునుగోడు విజయం టీయారెస్ ది అయితే వచ్చే ఏడాది ప్రధమార్ధంలో తెలంగాణాకు ముందస్తు ఎన్నికలు ఖాయమని అంటున్నారు. చూడాలి  అంతా మునుగోడు ఓటర్ల చేతుల్లోనే ఉంది మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News