టీడీపీ చేసిన వ‌రుస త‌ప్పులు.. వైసీపీకి దొరికిపోయిందా...!

Update: 2022-07-16 00:30 GMT
రాజ‌కీయాల్లో పొర‌పాట్లు చేస్తే.. స‌రిదిద్దుకునే అవ‌కాశం ఉంటుంది. అదే త‌ప్పులుచేస్తే మాత్రం స‌రిదిద్దు కునేందుకు చాలా ఏళ్ల స‌మ‌యం ప‌డుతుంది. ఇప్పుడు ఇలాంటి చ‌ర్చ టీడీపీలోనే జ‌రుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కేవ‌లం ఒక్క వారంలోనే రెండు ప్ర‌ధాన త‌ప్పులు చోటు చేసుకున్నాయ‌ని.. దీంతో పార్టీ లో నేత‌లు వాటికి స‌మాధానం చెప్పలేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని చెబుతున్నారు. ఒక‌టి.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థికి.. వైసీపీ మ‌ద్దతు ప్ర‌క‌టించింది.

ఈ స‌మ‌యంలో టీడీపీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. కేంద్రాన్ని ఇరుకున పెట్టే స‌మ‌యం వ‌చ్చింది. రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ఎన్నిక‌ల‌ను బూచిగా చూపించి.. ఏపీకి రావాల్సిన అన్నింటినీ.. సాధించుకునేందుకు వైసీపీ ప్ర‌య‌త్నించాల‌ని.. టీడీపీ నాయ‌కులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం నిధులు.. విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌ను రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల నేప‌థ్యంలో సాధించాల‌ని.. ఇప్పుడు ప్ర‌శ్నించే స‌మ యం జ‌గ‌న్‌కు వ‌చ్చింద‌ని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా చెప్పారు.

అయితే.. దీనిపై ఇంకా వైసీపీ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌కుండానే.. టీడీపీ కూడా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించేసింది. దీంతో వైసీపీని అప్ప‌టి వ‌ర‌కు కార్న‌ర్ చేసి.. వెంట‌నే ఇలా చేయ‌డంతో అప్ప‌టి దాకా వ‌చ్చిన మైలేజీ పూర్తిగా తుడిచి పెట్టుకు పోయింద‌ని అంటున్నారు టీడీపీ నేత‌లు. అంతేకాదు..

ఇప్పుడు వైసీపీని ప్ర‌శ్నించే ప‌రిస్థితి కూడా లేకుండా పోయింద‌ని కామెంట్లు చేస్తున్నారు. మ‌రోవైపు.. ఇలాంటిదే ఇంకో త‌ప్పు జ‌రిగింది. రాష్ట్రంలో గ‌నులు దోచేస్తున్నారు. కొండ‌లు త‌వ్వేస్తున్నారంటూ.. చంద్ర‌బాబు ఆరోపించారు.

దీనికి సంబంధించి రెండు రోజుల పాటు పార్టీ కార్యాల‌యంలో ఫొటో ఎగ్జిబిష‌న్ పెట్టి మ‌రీ.. వైసీపీ స‌ర్కారు పై దుమ్మెత్తి పోశారు. అయితే.. ఇప్పుడు ఇదే విష‌యం యూట‌ర్న్ తీసుకుంది. విశాఖ రుషి కొండ‌లో చంద్ర‌బాబు ఉన్న‌ప్పుడే.. దోచేసుకున్నారని, అప్ప‌టి మంత్రులు గ‌నులు దోచేశార‌ని.. ఇప్పుడు మాకు నీతులు చెబుతారా? అంటూ.. వైసీపీ తీవ్ర‌స్థాయిలో ఎదురు దాడికి దిగింది. అంతేకాదు..

అప్ప‌ట్లో టీడీపీలో ఉన్న మంత్రులు ఒక‌రిపై ఒక‌రు చేసుకున్న విమ‌ర్శ‌ల‌ను కూడా ఇప్పుడు ప్లే చేస్తోంది. దీంతో టీడీపీకి మైలేజీ రాక‌పోగా.. గ‌తాన్ని వెలికి తీయించుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని.. పార్టీలోనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News