ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి త‌ప్పిన విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం క‌ల్పించిన వెసులుబాట్లు ఇవే!

Update: 2022-07-01 09:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ (జూలై, 2022) పరీక్షలు రాసే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభ‌వార్త చెప్పింది. ఈ పరీక్షల్లో పాసయ్యే వారిని కంపార్ట్‌మెంటల్‌ అని కాకుండా రెగ్యులర్‌ విద్యార్థులుగానే ప‌రిగ‌ణిస్తామ‌ని తెలిపింది. వారికి రెగ్యులర్‌ విద్యార్థులకు మాదిరిగానే పరీక్షల్లో వచ్చిన మార్కుల ప్రకారం డివిజన్లను కేటాయిస్తామ‌ని ఊర‌ట క‌ల్పించింది. ఈ మేరకు నిబంధనలు సడలిస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే ఈ వెసులుబాటు ఈ ఒక్క విద్యాసంవత్సరానికి మాత్రమే వర్తించనుందని పేర్కొంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 2021–22కి సంబంధించి పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్‌ 27 నుంచి మే 9 వరకు పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాలను జూన్‌ 6న విడుదల చేశారు. కోవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా స్కూళ్లు సరిగా నడవకపోవడం, ముఖ్యంగా 8, 9 తరగతుల విద్యార్థులకు పాఠాల నిర్వహణ పూర్తిస్థాయిలో లేకపోవడంతో వారు చాలా వెనుకపడ్డారు. దీంతో పదో తరగతి పరీక్షల్లో దాదాపు 2 లక్షల మంది ఉత్తీర్ణులు కాలేకపోయారు. గ‌త 22 ఏళ్ల‌లోనే అతి త‌క్కువ‌గా 67 శాతం మాత్ర‌మే ఉత్తీర్ణ‌త శాతం న‌మోదైంది.

ఈ నేప‌థ్యంలో కోవిడ్‌తో తలెత్తిన ఇబ్బందులతో విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప‌దో త‌ర‌గ‌తిలో త‌ప్పిన‌ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల్లో కొన్ని వెసులుబాట్లు క‌ల్పించింది. సాధారణంగా రెగ్యులర్‌ పరీక్షల్లో ఫెయిలై సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులు ఆయా సబ్జెక్టులలో ఎన్ని మార్కులు సాధించినా కంపార్ట్‌మెంటల్‌ పాస్‌గానే పరిగణిస్తారు తప్ప డివిజన్లను కేటాయించరు. అయితే ఈసారి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ నిబంధన నుంచి మినహాయింపునిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

జూలై 6 నుంచి 15 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌దో త‌ర‌గ‌తి త‌ప్పిన విద్యార్థులు చెల్లించాల్సిన ప‌రీక్ష ఫీజుల‌ను కూడా ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. అలాగే ఈసారి రెగ్యులర్‌ పరీక్షల్లో పాసై కొన్ని సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వచ్చినవారికి బెటర్‌మెంట్‌ పరీక్షలు రాసుకునే అవకాశం కూడా కల్పించింది. ఇంటర్మీడియెట్‌లో తప్ప పదో తరగతిలో ఇలా బెటర్‌మెంట్‌ పరీక్షల విధానం లేదు.

కానీ కోవిడ్‌తో విద్యార్థులు ఇబ్బందిపడటంతో వారికి మార్కులను పెంచుకునేందుకు ఈ అవకాశం కల్పించింది. 49, అంత కంటే తక్కువ మార్కులు వచ్చినవారు రెండు సబ్జెక్టుల్లో బెటర్‌మెంట్‌ పరీక్షలు రాసుకునేందుకు అవ‌కాశ‌మిచ్చారు.

సప్లిమెంటరీ పరీక్షల సమయంలోనే ఈ బెటర్‌మెంట్‌ విద్యార్థులూ పరీక్షలు రాయనున్నారు. కాగా టెన్త్‌ విద్యార్థులకు మాదిరిగానే ఇంటర్మీడియెట్‌ విద్యార్థులను కూడా సప్లిమెంటరీ పరీక్షల్లో కంపార్ట్‌మెంటల్‌ పాస్‌గా కాకుండా రెగ్యులర్‌ విద్యార్థులుగా పరిగణించి డివిజన్లు ఇవ్వాలని విద్యార్థులు తల్లిదండ్రులు ప్ర‌భుత్వానికి విన్న‌విస్తున్నారు.
Tags:    

Similar News