భయపెట్టి.. బెదిరించి.. హైదరాబాద్‌ బాలికపై రేప్‌లో కీలక విషయాలు ఇవే!

Update: 2022-11-30 05:01 GMT
హైదరాబాద్‌ శివారు హయత్‌నగర్‌లో పదో తరగతి బాలికపై ఐదుగురు తోటి విద్యార్థులు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు బాలురను పోలీసులు జువైనల్‌ హోంకు తరలించారు. కాగా ఐదుగురు నిందితుల్లో నలుగురు బాలికతోపాటే పదో తరగతి చదువుతుండగా ఒకడు తొమ్మిదో తరగతి చదువుతుండటం గమనార్హం.

కాగా ఈ రేప్‌కు సంబంధించి అనేక కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. బాలిక తల్లిదండ్రులు ఇద్దరూ ఉదయాన్నే పనికి వెళ్లిపోతారు. ఇంట్లో బాలిక మాత్రమే ఉంటుంది. ఒక రోజు పుస్తకం కావాలని ఆమె ఇంటికి వెళ్లాడు.. ఆమె స్నేహితుడు. ఆ సమయంలో బాలిక స్నానం చేస్తుండటంతో తన ఫోన్‌తో బాలికకు తెలియకుండా ఫొటో తీశాడు. తర్వాత ఆ ఫొటోను చూపించి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించి బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు.

ఆ తర్వాత అతడు తన తోటి స్నేహితులకు కూడా ఈ విషయాన్ని చెప్పడంతో వారు సైతం బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నారు. ఇప్పటికే ఇలా పలుమార్లు బాలికను భయపెడుతూ, బెదిరిస్తూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితులంతా బాలికతోపాటే పదో తరగతి చదువుతున్నారు. తన తోటి విద్యార్థులే కావడంతో బాలిక సైతం వారితో స్నేహంగా ఉండేది. ఈ నేపథ్యంలోనే పుస్తకం కోసం ఇంటికెళ్లిన ఒకడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతడి స్నేహితులు ఇలా పలుమార్లు ఈ కిరాతకం సాగుతూ వచ్చింది.

అంతేకాకుండా బాలికపై లైంగిక దాడికి సంబంధించిన వీడియోను సైతం దుర్మార్గులు సోషల్‌ మీడియాలో ఇతరులకు పంపారు. ఆ వీడియో బాలిక తండ్రి దాకా చేరిందని సమాచారం. దీంతో బాలిక తల్లిదండ్రులు హయత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ దారుణమంతా ఈ ఏడాది ఆగస్టులో చోటు చేసుకుంది. అయితే బాలికను నిందితులు ఐదుగురు భయపెట్టి.. బెదిరించడంతో తల్లిదండ్రులకు చెప్పుకుండా బాలిక మిన్నకుండిపోయింది. దీన్ని అలుసుగా తీసుకున్న దుర్మార్గులు బాలిక జీవితంతో ఆడుకున్నారు.

మైనర్లయిన నిందితులపై పోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఐదుగుర్ని అదుపులోకి తీసుకుని మంగళవారం జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు ముందు  హాజరుపరిచారు.

కాగా నిందితులు ఐదుగురికి సంబంధించి పోలీసుల విచారణలో అనేక కీలక విషయాలు వెలుగుచూశాయని అంటున్నారు. ఆ ఐదుగురు విద్యార్థులు అంతా ఇరుగుపొరుగు వారేనని సమాచారం. బాలిక ఇంటికి వారి ఇళ్లు దగ్గరే.  ఈ ఐదుగురూ నిందితులు పాఠశాల ముగియగానే నిత్యం సెల్‌ఫోన్లలో అశ్లీల చిత్రాలు చూడడం అలవాటు చేసుకున్నారని తెలుస్తోంది. అప్పుడప్పుడూ నగర శివారు ప్రాంతాలకు వెళ్లి ఇష్టారాజ్యంగా తిరిగేవారు. డ్రగ్స్‌కు అలవాటుపడ్డారని.. స్కూలులో టీచర్ల మాట కూడా వినేవారు కాదని అంటున్నారు.

ఈ నేపథ్యంలో తమ ఇంటి సమీపంలో ఉంటూ తమతో పాటు చదివే  బాలికపై నిందితులు కన్నేశారు. ఒకే స్కూల్‌లో చదివేవారు కావడంతో బాలిక వారితో కొంచెం స్నేహంగా ఉండేది. దీన్ని అవకాశంగా తీసుకున్న నలుగురు..  ప్రణాళిక ప్రకారం ఆమెను అత్యాచారం చేశారు.

బాలిక నిందితులు బెదిరింపులకు భయపడటంతో జరిగిన ఘోరాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. దీంతో నిందితులు ఆమెపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డారు.
మరోవైపు దారుణానికి సంబంధించిన వీడియో వెలుగుచూసిన నేపథ్యంలో బాధితురాలు, నిందితుల తల్లిదండ్రుల మధ్య రాజీ కుదిర్చేందుకు స్థానిక పెద్దలు ప్రయత్నించినట్లు తెలిసింది.

కాగా బాలికపై సామూహిక అత్యాచారానికి సంబంధించిన వీడియోను నిందితులు ఇతరులకు షేర్‌ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో వీడియో హల్‌చల్‌ చేసింది. ఈ నేపథ్యంలో అశ్లీల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తే పోక్సో, జువెనైల్‌ జస్టిస్‌ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News