వాళ్లు ₹100 కోట్లు ఆఫర్ చేశారన్న రోహిత్ రెడ్డి.. పార్టీ అప్పజెప్పిన పని పూర్తి చేశానన్న రేగా

Update: 2022-10-27 05:12 GMT
మొయినాబాద్ ఫాంహౌస్ లో తమకు 100 కోట్ల చొప్పున ఆఫర్ చేసిన వ్యక్తులను పోలీసులకు పట్టించి ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. వీరు ఇప్పుడు అంత పెద్ద అమౌంట్ ఆఫర్ చేసినా పార్టీ కోసం వదులుకొని పట్టించిన వైనం.. పార్టీ అధిష్టానానికి చెప్పి మరీ వారి బుక్ చేసిన తీరు చర్చనీయాంశమైంది. అసలు ఎవరిది ఈ ప్లాన్.? దీనివెనుక గులాబీ బాస్ ఉన్నారా? అసలేం జరిగిందన్నది ఈ ఆపరేషన్ లో పాల్గొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటపెట్టారు.

నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై అందులో ఒకరైన ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. 'బాధ్యత కలిగిన భారత పౌరుడిగా.. క్రమశిక్షణ కలిగిన బీఆర్ఎస్ కార్యకర్తగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నాకు పార్టీ అప్పజెప్పిన పని విజయవంతం చేశాను' అంటూ పోస్ట్ పెట్టడం సంచలనమైంది.

ఇక తమను కొనేందుకు వాళ్లు రూ.100 కోట్లు ఆఫర్ చేశారని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు. ప్రతీ ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు, ఎమ్మెల్యేలను చేర్పించినా రూ.100 కోట్లు ఇస్తామన్నట్లు ఆయన పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఇది ఎఫ్ఐఆర్ లో ఉంది. చేరికకు ముందు రూ.50 కోట్లు, తర్వాత మిగతావి ఇచ్చి సివిల్ కాంట్రాక్టులు ఇప్పిస్తామని హామీలిచ్చారని ఎఫ్ఐఆర్ లో ఉంది.

ఇక అటు నలుగురు ఎమ్మెల్యేలు రాత్రి నుంచి ప్రగతి భవన్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. మొయినాబాద్ ఫాంహౌస్ నుంచి మీడియాతో మాట్లాడనీయకుండా కేసీఆర్ డైరెక్టుగా ఫాంహౌస్ కు  ఈ నలుగురిని రప్పించారు.  ఎమ్మెల్యేలు రాత్రంతా ప్రగతి భవన్ లోనే ఉన్నట్టు సమాచారం. వీరు బయటకు వస్తే ఇంటర్వ్యూలు, మీడియా, బీజేపీ నేతలకు టార్గెట్ అవుతారని అత్యంత సెక్యూరిటీ ఉండే సీఎం నివాసంలోనే పెట్టినట్టు తెలుస్తోంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు  ప్రలోభ ఘటనపై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఏ1గా రామచంద్ర భారతి, ఏ2గా నందకుమార్, ఏ3గా సింహయాజీ ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News