వైసీపీలో ఆ సీనియ‌ర్ ఆశ‌లు ఇక తీర‌న‌ట్టే..!

Update: 2021-07-02 11:30 GMT
రాజకీయ నేత‌ల‌కు ఆశ‌లు చాలానే ఉంటాయి. మ‌రి వాటిని సాధించుకునేందుకు ఉండాల్సిన లౌక్యం ఉంటేనేక‌దా.. ప‌నులు జ‌రుగుతాయి. కానీ, ఈ విష‌యంలోనే చాలా మంది ఫెయిల‌వుతున్నారు. ఇలాంటి వారిలో నెల్లూరుకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు. మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌రెడ్డి పేరు వినిపిస్తోంది. ఈయ‌న‌కు మంత్రి ప‌ద‌విపై చాలానే ఆశ‌లు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ నుంచి వ‌చ్చి వైసీపీలో చేరిన త‌న‌కు జ‌గ‌న్ మంచి గుర్తింపు ఇస్తార‌ని ఆయ‌న ఆశించారు. అయితే.. ఇది జ‌ర‌గ‌లేదు. దీంతో ఆయ‌న కొన్నాళ్లు వెయిట్ చేసి.. అధికారుల‌ను అడ్డుపెట్టి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

త‌ర్వాత‌.. ఏమైందో ఏమో.. మ‌ళ్లీ సైలెంట్ అయ్యారు. ఇటీవ‌ల ఆయ‌న కీల‌క స‌ల‌హాదారును క‌లిసేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే.. ఆయ‌న అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌లేదు. నిజానికి సీఎంను క‌లిసేందుకు అప్పాయింట్ మెంట్ అడిగితే.. ఇవ్వ‌క‌పోతే.. అనుకోవాలి. కానీ, స‌ల‌హాదారు అప్పాయింట్‌మెంట్ కూడా ద‌క్కక‌పోవ‌డం.. ఇప్పుడు జిల్లాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జిల్లాకు చెందిన ఇద్ద‌రు మంత్రులను ఆనం ప‌ట్టించుకోక‌పోవ‌డం.. వారిని చిన్న చూపు చూడ‌డం.. త‌న‌కన్నా జూనియ‌ర్లు అనే భావ‌న‌తో వుండ‌డం వంటివి అధిష్టానానికి ఆగ్ర‌హం తెప్పించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

దీనికి తోడు మంత్రుల‌ను, అధిష్టానాన్ని టార్గెట్ చేస్తున్న‌ట్టు ప‌దే ప‌దే మాట్లాడ‌డం కూడా జ‌గ‌న్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. అందుకే జ‌గ‌న్ ఆనంను పూర్తిగా ప‌క్క‌న పెట్టేసిన ప‌రిస్థితే ఉంది. నిజానికి ఇప్పుడు సీనియ‌ర్ల‌కు కీల‌క ప‌ద‌వులు ఇచ్చి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీపై మ‌రోసారి పైచేయి సాధించాల‌ని.. జ‌గ‌న్ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌న తండ్రి కేబినెట్‌లో ప‌నిచేసిన వారికి ఆయ‌న ప్రాధాన్యం ఇస్తున్నారు. నేరుగా మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌క‌పోయినా.. వారిని కీల‌క బాధ్య‌త‌ల్లో నియ‌మిస్తున్నారు. అయితే.. ఆనం విష‌యాన్ని మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు.

దీనికి ఆయ‌న‌లో లౌక్యం లేక‌పోవ‌డం.. నేనే సీనియ‌ర్‌ను అనే భావ‌న ఉండ‌డ‌మే కార‌ణ‌మ‌ని స్థానికంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఎవ‌రూ కూడాఆనం ను ల‌క్ష్య పెట్ట‌డం లేదు. ఆయ‌న అస‌లు నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్నారో.. లేదో కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇదంతా చూస్తే.. స‌ద‌రు నేత‌కు ఇక‌, వైసీపీలో ఫ్యూచ‌ర్ లేన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News