మూడు దక్షిణాది రాష్ట్రాలు.. ముగ్గురు గవర్నర్లు.. సర్కార్లతో కయ్యం..

Update: 2022-11-09 02:30 GMT
స్థానిక ప్రభుత్వాలతో వైరం నేపథ్యలో తెలంగాణ.. తమిళనాడు.. కేరళ.. మూడు దక్షిణాది రాష్ట్రాల గవర్నర్లు తాజాగా వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. దక్షిణాదిలోని కర్ణాటక, ఏపీల్లో మాత్రమే గవర్నర్లు తమ విధి తాము చేసుకుని వెళ్లిపోతున్నారు. ఇందులో తమిళిసై పై  ఆమె గవర్నర్ గా ఉన్న తెలంగాణతో సొంత రాష్ట్రం తమిళనాడులోనూ సంచలనంగా మారుతున్నారు. తాజాగా తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే పత్రిక మురసొలి.. తనను ఉద్దేశిస్తూ రాసిన కథనంపై తమిళిసై తీవ్రంగా మండిపడ్డారు.

"ఇంట్లో తెలుగు (స్టాలిన్ కుటుంబాన్ని ఉద్దేశించి) మాట్లాడేవారు నన్ను ప్రశ్నిస్తున్నారు"అంటూ మండిపడ్డారు. ఇక ఆమెనే తెలంగాణ గవర్నర్ హోదాలో.. బిల్లులపై రాజ్ భవన్ కు వచ్చి చర్చించాల్సిందేనని టీఆర్ఎస్ సర్కారుకు తేల్చిచెప్పారు. అంతేకాక.. తెలంగాణలో ఫాంహౌస్ రాజకీయాలను ప్రస్తావిస్తూ విమర్శలకు దిగారు. మరోవైపు కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహ్మద్ ఖాన్ అక్కడి పినరాయి విజయన్ సర్కారుపై ఒంటికాలిపై లేస్తున్నారు. సోమవారం ప్రెస్ మీట్ నుంచి సీపీఎంకు చెందిన మీడియా ప్రతినిధులను గెట్ ఔట్ అన్నారు. గత వారం ఆర్థిక మంత్రి పనితీరు నచ్చలేదంటూ ఆరిఫ్ వ్యాఖ్యానించడం.. అదేం లేదు అంటూ సీఎం పినరాయి విజయన్ ఖండించిన సంగతి తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వ మనుషులన్నట్లు.. గవర్నర్ల వ్యవస్థ ఎన్టీఆర్ హయాంలో తీవ్రంగా వివాదాస్పదమైంది. ఆ తర్వాత కూడా పలుసార్లు ఇలాంటి ఘటలు చోటుచేసుకున్నా.. ఇప్పుడు ఒకేసారి కీలక రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు
చర్చనీయాంశం కావడం గమనార్హం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తున్న క్రమంలో గవర్నర్లుగా ఉన్నవారిని కేంద్ర ప్రభుత్వ మనుషులుగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

తమిళిసై పై మురసొలి మండిపాటు "డీఎంకే పెద్దలవి తెలుగు మూలాలు" అని తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మురసొలి పత్రిక దీటుగా స్పందించింది. "తెలంగాణ గవర్నర్ తమిళనాడులో రాజకీయాలు చేయొద్దు. ఇది ఆమె పని కాదు. రాజకీయం కావాలనుకుంటే రిజైన్ చేసి తమిళనాడుకు రండి"అని సూచించింది. తమిళిసై రాజకీయ, చట్ట పరిమితుల్లో ఉండాలని.. రాష్ట్రాల పట్ల గౌరవంతో మెలగాలని హితవు చెప్పింది. ఇక తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీరు కూడా ఇటీవల చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. "గవర్నర్ రవి ఇప్పటికే హద్దులు దాటారు. తన చర్యలతో గందరగోళం రేపారు" అంటూ వ్యాఖ్యానించింది. ఆయనను తొలగించాలంటూ డీఎంకే పట్టుబడుతోంది కూడా.

తెలంగాణలో 7.. తమిళనాడులో 20 బిల్లుల పెండింగ్ తమిళనాడు గవర్నర్ వద్ద 20 బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఏడు బిల్లులపై గవర్నర్ ఆమోద ముద్ర పడాల్సి ఉంది. గత ఏప్రిల్ లో నీట్ మినహాయింపు బిల్లును రాష్ట్రపతికి పంపడం లేదంటూ గవర్నర్ పై డీఎంకే నాయకులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో రెండుసార్లు ఆమోద ముద్ర పడినా గవర్నర్ ఇలా చేయడం సరికాదంటూ ధ్వజమెత్తారు.
Tags:    

Similar News