వెన్నులో వణుకు పుట్టించిన ‘టైగర్ కదంబ’

Update: 2015-08-23 07:39 GMT
బోనులో ఉన్న పులిని చూసేందుకు ఎంత ఉత్సాహమో.. అదే పులి బోను బయటకు వస్తే భయోత్పాదం సృష్టిస్తుందో జూ అధికారులే కాదు.. సందర్శకులకు అనుభవ పాఠమైంది. శనివారం హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ జూలాజికల్ పార్కులో చోటు చేసుకున్న ఘటన వింటే.. వెన్నులో నుంచి వణుకు మొదలు కావాల్సిందే.

అదృష్టం బాగుండటమో.. బెంగాల్ టైగర్ కదంబ పుణ్యంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. బెంగాల్ టైగర్ ఎన్ క్లోజర్ నుంచి బయటకు రావటం.. ఆ వెంటనే దాన్ని గుర్తించిన జూ సిబ్బంది అధికారులకు సమాచారం అందించటం.. రంగంలోకి దిగిన వారు రెండు గంటల పాటు కష్టపడి.. దాన్ని మత్తులోకి పంపి మళ్లీ బోనులో బంధించారు. అప్పటివరకూ టెన్షన్ తో వణికిపోయిన వారు.. ఆ తర్వాత హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

నెహ్రూ జూలాజికల్ పార్కులో ఉన్న ఆడ పులికి బ్రీడింగ్ చేయించటానికి ఐదు నెలల క్రితం.. కర్ణాటకలోని మంగళూరు జూ నుంచి కదంబ అనే మగపులిని తీసుకొచ్చారు. పులుల బ్రీడింగ్ కోసం ప్రత్యేకంగా ఒక ఎన్ క్లోజర్ ఏర్పాటు చేశారు. శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో కదంబను తీసుకొచ్చి బ్రీడింగ్ ఎన్ క్లోజర్ లోకి వదిలారు. మరోవైపు ఆడపులిని తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతలో ఎన్ క్లోజర్ నుంచి కదంబ బయటకు వచ్చేసింది. ఎన్ క్లోజర్ చుట్టూ ఉన్న ఇనుప కంచె ఎక్కి బయటకు వచ్చిన పులిని చూసిన కీపర్లు.. వెంటనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఒక్కసారిగా కలకలం రేగింది. పులి ఉన్న వైపు ఉన్న అన్ని దారుల్ని మూసేశారు. సందర్శకులు ఆ ప్రాంతంలో లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు అధికారుల బృందం రంగంలోకి దిగి రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించి.. మత్తు ఇచ్చే గన్ తో దాన్ని బోనులో బంధించారు. ఇంత భారీ తప్పు ఎలా జరిగింది? కారణం ఏమిటన్న అంశంపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు జరిగిన ఘటనపై చాలా సీరియస్ గా ఉన్నారు.

మరోవైపు.. కదంబ కీపర్ల వైపు వెళ్లినా.. ఒకవేళ కీపర్లు కదంబ బయటకు రావటాన్ని గమనించకున్నా భారీ ప్రమాదం చోటు చేసుకునేది. నిజానికి అలా జరిగితే ఏం జరిగేదన్న అంశాన్ని ఆలోచించటానికి కూడా భయమేసే పరిస్థితి. మొత్తంగా.. టైం బాగుండి పెను ముప్పు తృటి తప్పిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News