జ‌డ్జీ ధ‌ర్నా...హైకోర్టు ముందు ఆందోళ‌న‌

Update: 2017-08-02 05:37 GMT
స‌హజంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జనం రోడ్లపై ధర్నా నిరసనలు చేస్తారు. వారి స‌మ‌స్య‌ల‌ను సంబంధిత వ‌ర్గాలు, ప్ర‌భుత్వాలు ప‌రిష్కారిస్తుంటాయి. అయితే ఉన్న‌త స్థానంలో ఉన్న ఓ న్యాయ‌మూర్తి త‌న స‌మ‌స్య‌ల కార‌ణంగా రోడ్డెక్కారు. త‌న‌కు న్యాయం చేయాల‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌ లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఏకంగా రాష్ట్ర స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ముందు న్యాయం కోసం ఆందోళ‌న చేశారు.

అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జిగా పని చేస్తున్న ఆర్‌ కె శ్రీవాస్‌.. మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఎదుట ధర్నాకు దిగారు. నిబంధనల ప్రకారం.. న్యాయమూర్తులను మూడేళ్ల‌కోసారి బదిలీ చేయాలి. కానీ, కుట్రపూరితంగా తనను 15 నెలల్లో నాలుగుసార్లు బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పిల్లల చదువులకు తీవ్ర ఆటంకం కలుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని హైకోర్టు న్యాయమూర్తి - రిజిస్ట్రార్‌ జనరల్‌ కు మొర పెట్టుకున్నా.. చర్యలు తీసుకోలేదని ఆయన వాపోయారు. బుధవారం కూడా ధర్నా చేస్తానని, న్యాయం జరిగేవరకూ పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆందోళన బాట పట్టిన తనపై హెకోర్టు చర్యలు తీసుకుంటుందని తెలుసని, ఉద్యోగం కూడా పోవచ్చని అన్నారు. కానీ, కొందరు వ్యక్తులకు తాను దీర్ఘకాలం భయపడేది లేదని తేల్చి చెప్పారు. అంతేకాక, తనను అరెస్టు చేసి జైలుకు పంపే అవకాశం ఉన్నదని, దీనికి సిద్ధపడే ఉన్నానని శ్రీవాస్‌ చెప్పారు. న్యాయశాఖలో సంస్కరణలు తేవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జడ్జి సత్యాగ్రహం పేరుతో నిరసనకు దిగటంతో పలువురు న్యాయవాదులు ఆయనకు మద్దతుగా నిలిచారు. కుటుంబప‌ర‌మైన అంశాల విష‌యంలో మాన‌వ‌తా దృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రించి ఉండాల్సింద‌ని ప‌లువురు పేర్కొన్నారు.
Tags:    

Similar News