ఆర్టీసీ స‌మ్మెలో జేఏసీకి షాక్‌.. విధుల్లోకి ఉద్యోగులు

Update: 2019-11-03 09:17 GMT
తెలంగాణ‌లో ఆర్టీసీ స‌మ్మె రోజు రోజుకు స‌రికొత్త‌గా మ‌లుపులు తిరుగుతోంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం విధిస్తోన్న డెడ్ లైన్లు ఓ వైపు... అటు ప్ర‌భుత్వం దిగి వ‌చ్చే వ‌ర‌కు స‌మ్మె కొన‌సాగుతుంద‌ని ఆర్టీసీ జేఏసీ నేత‌ల డిమాండ్లు మ‌రోవైపు ఉండ‌డంతో తీవ్ర ఆందోళ‌న‌లో చాలా మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్ప‌టికే అన‌ధికారిక లెక్క‌ల ప్ర‌కారం 25 మంది కార్మికులు మృతి చెందిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా ఆదివారం హ‌న్మ‌కొండ డిపోకు చెందిన ర‌వీంద‌ర్ అనే ఆర్టీసీ కండెక్ట‌ర్ సైతం గుండెపోటుతో నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెంద‌డంతో ప‌రిస్థితి తీవ్ర‌త‌ను తెలియజేస్తోంది.

ఇక కేసీఆర్ ఇప్ప‌టికే ఆర్టీసీ స‌మ్మె విష‌యంలో పలుసార్లు అల్టిమేటం జారీ చేయ‌గా... తాజాగా మ‌రోసారి
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు నవంబర్‌ 5లోగా తిరిగి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే నెల రోజులుగా జ‌రుగుతోన్న స‌మ్మె నేప‌థ్యంలో భ‌విష్య‌త్తు - ఉద్యోగ భద్ర‌త విష‌యంలో చాలా మంది కార్మికులు ఇప్పుడు యూ ట‌ర్న్ తీసుకుంటున్నారు. తాజాగా కేసీఆర్‌ డెడ్‌ లైన్‌ నేపథ్యంలో ఓ ఆర్టీసీ ఉద్యోగి తిరిగి విధుల్లో చేరాడు.

హైద‌రాబాద్‌ లోని ఉప్పల్‌ డిపోలో అసిస్టెంట్‌ డిపో మేనేజర్‌ గా పనిచేస్తున్న పనిచేస్తున్న కేశవ కృష్ణ.. తిరిగి విధుల్లో చేరుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం డిపో మేనేజర్‌ ను క‌లిసి తాను తిరిగి విధుల్లో చేరుతున్న‌ట్టు లేఖ అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు తను సమ్మె విరమించి బేషరతుగా విధుల్లో చేరుతున్నట్టు కృష్ణ పేర్కొన్నారు. అదే టైంలో జేఏసీ నేత‌లు నెల రోజులుగా స‌మ్మె చేస్తున్నా చాలా మంది కార్మికుల‌కు వాళ్లు స‌మ్మెను అనుకున్న స్థాయికి తీసుకువెళ్ల‌లేక‌పోయార‌న్న సందేహాల ఉన్నాయి.

నెల రోజులుగా స‌మ్మె కొన‌సాగుతున్నా... తాము ఎన్నో త్యాగాలు చేస్తున్నా ఇప్ప‌టికీ ఓ కొలిక్కి తీసుకురాలేక‌పోయార‌ని భావిస్తోన్న వారంద‌రు ఇప్పుడు యూ ట‌ర్న్ తీసుకుని తిరిగి విధుల్లో చేరుతున్నారు. మ‌రి కొంద‌రు కార్మికులు అయినా స‌మ్మె నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే అది స‌మ్మెపై ఖ‌చ్చితంగా ఎఫెక్ట్ చూప‌డంతో పాటు ప్ర‌భుత్వానికి కాస్త ఊర‌ట క‌లిగిన‌ట్టే అవుతుంది. మ‌రి ఈ స‌మ్మె ఎలా ట‌ర్న్ అవుతుందో ?  చూడాలి.
Tags:    

Similar News