మాళవిక ఈ సందేహాలకు సమాధానాలిస్తారా?

Update: 2015-11-22 04:24 GMT
ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న గంగిరెడ్డిని విదేశాల నుంచి స్వదేశానికి తీసుకురావటం.. ఆయన్నికడప జైల్లో ఉంచటం తెలిసిందే.  ఈ సందర్భంగా తన భర్త ప్రాణాలకు హాని ఉందంటూ గంగిరెడ్డి సతీమణి మాళవిక కరుణ రసాత్మకంగా చాలా విషయాల్ని ప్రస్తావించారు. ఆమె మాటల్ని వింటే.. గంగిరెడ్డి నోట్లో వేలు పెట్టుకుంటే కొరికే సామర్థ్యం లేని వ్యక్తిగా కనిపిస్తారు. తన భర్త ప్రాణాలకు ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చిన ఆమె.. పోలీసులు పెద్ద ఎత్తున గంగిరెడ్డి కోసం వెతికే సమయంలో బయటకు రాని ఆమె.. తన భర్త విదేశాల్లో ఉన్నప్పుడు మాట కూడా మాట్లాడని ఇదే మాళవిక.. ఇప్పుడు మాత్రం తన భర్త ప్రాణాలకు హాని ఉందంటూ మీడియా ముందుకు రావటం గమనార్హం.

తన భర్త మీద ఉన్న పదుల కేసులకు సంబంధించి మాట్లాడుతూ.. కేవలం రెండు కేసులకు మాత్రమే సంబంధం ఉందని చెప్పుకొచ్చారు. తన భర్తకు ప్రాణహాని ఉందంటూ గవర్నర్ కు లేఖ ఇవ్వాలని భావిస్తున్నా.. ఆయన్ను కలిసే స్థాయి తమకు లేదని ఆమె చెప్పుకొచ్చారు. గవర్నర్ ను కలిసే స్థాయి లేని గంగిరెడ్డి ఫ్యామిలీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఆరోపణలు.. విమర్శలు చేసే స్థాయి ఎలా వచ్చినట్లో..?

వ్యాపారం కోసం తన భర్త దుబాయ్ వెళ్లారని.. పారిపోలేదని చెబుతున్న మాళవిక.. తన భర్తపై లుక్ అవుట్ నోటీసులు.. రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినప్పుడు భయంతోనే బయటకు రాలేదని చెప్పారు. నిజానికి తప్పు చేయనప్పుడు దాక్కోవటం వల్ల మరింత ముప్పు ఉంటుంది కదా. తప్పులు చేయనప్పుడు.. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చినట్లే.. లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన వెంటనే.. ఇదే మాళవిక మీడియా ముందుకు వచ్చి.. తన భర్త లొంగిపోతారని చెప్పి ఉండాల్సింది కదా? అలాంటి పని ఆమె ఎందుకు చేయలేదు?

తన భర్తను ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా అభివర్ణిస్తున్నప్పుడు.. అలాంటిదేమీ లేదంటూ మీడియా ముందుకో.. కోర్టు దగ్గరకో ఎందుకు వెళ్లనట్లు? జైల్లో ఉంటూ బెయిల్ మీద బయటకు వచ్చిన సందర్భంలో వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లాల్సి వస్తే.. చట్టబద్ధంగా అనుమతులన్నీ తీసుకోకుండా.. సమాచారం ఇవ్వకుండా ఎందుకు వెళ్లిపోయినట్లు..?

తమకు ప్రభుత్వం చెబుతున్నట్లుగా వందల కోట్ల ఆస్తులు లేవని మాళవిక చెబుతున్నారు. గంగిరెడ్డిని విదేశాల నుంచి తీసుకొచ్చినప్పుడు ఏపీ డీజీపీ రాముడు మాట్లాడుతూ గంగిరెడ్డికి దాదాపు రూ.300 నుంచి రూ.400కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే.. తమ వద్ద అంత ఆస్తి లేదని.. మొత్తంగా మూడు.. నాలుగు కోట్ల ఆస్తి ఉన్నట్లు చెబుతున్నారు. గంగిరెడ్డి భార్యే స్వయంగా మీడియాకు రూ.3.. రూ.4కోట్ల ఆస్తి ఉందని చెప్పిన నేపథ్యంలో.. మిగిలిన ఆస్తిని ప్రభుత్వం సాధీనం చేసుకోవటానికి మాళవిక ఓకే చెబుతారా?

తన భర్త మీద 28 కేసులు ఉన్నట్లు చెబుతున్నారని.. వాస్తవానికి రెండు కేసులే ఉన్నాయని.. వాటిల్లో ఒక కేసుకు శిక్ష అనుభవించినట్లుగా చెబుతున్నారని మాళవిక చెబుతున్నారు. మారిషస్ నుంచి తీసుకురావటం కోసం.. రద్దు అయిపోయిన కేసులో ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి.. అక్కడ నుంచి తీసుకొచ్చారని ఆమె పేర్కొన్నారు. ఒకవేళ అదే నిజమైతే.. కోర్టులు ఉన్నాయి కదా? శిక్ష అనుభవించిన కేసుకు సంబంధించి జీవో జారీ చేస్తే.. వాటిని తీసుకొని కోర్టును ఆశ్రయించొచ్చు కదా? అలాంటి పని ఎందుకు చేయనట్లు?

మాళవిక చెప్పినట్లుగా గంగిరెడ్డి కుటుంబం మొత్తం రాజకీయ నేపథ్యం ఉందన్న మాట వాస్తవమే. గంగిరెడ్డి తండ్రిని ఆదర్శ రాజకీయ నేతగా పేరుంది. తెలుగుదేశం వారు సైతం.. గంగిరెడ్డి తండ్రి గురించి తప్పుగా ఒక్క మాట చెప్పరు. రాజకీయ విభేదాలు ఉన్నాయే అనుకుంటే.. తండ్రిని విమర్శించని వారు.. కొడుకును ఎందుకు తప్పు పడతారు?
Tags:    

Similar News