పవర్ చేతిలో ఉంటే ఏం చెబితే అది నడుస్తుందా?

Update: 2021-08-25 03:32 GMT
ముఖ్యమంత్రి ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతున్న వేళ.. అందరూ ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన కాసేపటికి సీబీఐ..ఈడీ అధికారులు సదరు సీఎం నివాసాన్నితనిఖీ చేసే వీలుంటుందా?

ముఖ్యమంత్రి కార్యాలయంలోకి సీబీఐ అధికారులు వచ్చేసి.. రికార్డుల్ని కెలికేసి.. అదంతా విచారణలో భాగమని చెప్పొచ్చా?

సీఎంను విమర్శించారని పేర్కొంటూ ఒక ఎంపీని అరెస్టు చేసి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించే వీలుందా?

ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. కేంద్రమంత్రిని అదుపులోకి తీసుకొని గంటల పాటు తమతో ఉంచుకోవచ్చా?

ఈ ప్రశ్నలకు మామూలుగా అయితే నో చెబుతారు. కానీ.. ఇప్పుడు ఎస్ చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే.. గడిచిన ఆరేడేళ్లలో చేతిలో ఉన్న అధికారాన్ని ఇష్టారాజ్యంగా వినియోగించేస్తున్న  ఉదంతాల్లో కొన్ని మాత్రమే ఇవి. అధికారం ఎవరి చేతిలో ఉంటే వారు చెలరేగిపోవచ్చన్న సంకేతాల్ని ఇచ్చేలా చోటు చేసుకునే పరిణామాలు ప్రజాస్వామ్యవాదులు జీర్ణించుకోలేని పరిస్థితికి తీసుకొస్తున్నాయి. ఇలాంటి ఉదంతాల్ని చూస్తే.. ఎవరి చేతిలో ఉన్న అధికారాన్ని వారు.. తామేమిటో చూపించాలని డిసైడ్ అయితే తిరుగు ఉండదన్నట్లుగా వ్యవహరించే ధోరణి అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

తాజాగా కేంద్రమంత్రి నారాయణ్ రాణెను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయటం.. రాత్రి ఎప్పుడో ఆయనకు బెయిల్ రావటం తెలిసిందే. ఇదంతా చూస్తే.. రాజకీయంగా చిక్కులు కల్పించాలని పవర్ లో ఉన్న వారు డిసైడ్ అయితే.. ఎవరినైనా.. ఎక్కడైనా అదుపులోకి తీసుకునే అవకాశం దేనికి నిదర్శనం?ఇవాళ నేతల అరెస్టులతోనే సరిపోయిన వైనం రేపొద్దున మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే.. ప్రజల పరిస్థితి ఏమిటి? అన్నది అసలు ప్రశ్న.

సాదాసీదా వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకునే వేళలో.. హక్కుల గురించి..రాజ్యాంగం కల్పించిన రక్షణల గురించి అడిగితే ఎటకారం చేసుకోవటం తెలిసిందే. అలాంటి పరిస్థితి ఈ రోజున కేంద్రమంత్రి స్థాయిలో ఉన్న వారికి ఎదురైతే.. దేశంలోని ప్రజాస్వామ్యం పక్కదారి పట్టేస్తుందన్న భావన కలుగక మానదు. ‘నేను కానీ పక్కన ఉంటే చెంప పగలకొట్టే వాడిన’న్న కేంద్రమంత్రి మాట ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకునే వరకు వెళ్లింది. అది కూడా.. గంటల వ్యవధిలోనే చట్టం తన పని తాను చేసుకుపోవటం ఇక్కడ గమనించాల్సిన అంశం.

కేంద్రమంత్రిని మధ్యాహ్నం వేళలో అదుపులోకి తీసుకొని రాత్రివేళకు బెయిల్ ఇవ్వటం ఒక ఎత్తు అయితే.. ఆయన ప్రస్తావించిన ఒక విషయాన్ని మాత్రం అండర్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహారాష్ట్ర పోలీసులు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేశారని కేంద్రమంత్రి నారాయణ్ రాణె వ్యాఖ్యానిస్తున్నారు. తాను గోల్వాల్కర్ గురూజీ ఆశ్రమంలో భోజనం చేస్తున్నప్పుడు తన వద్దకు ఒక డీసీపీ వచ్చారని.. ఆయన తనను అరెస్టు చేస్తానని చెప్పినట్లు చెప్పారు.

అధికారి మాటకు తాను.. నోటీసు ఉందా? అని ప్రశ్నిస్తే.. లేదని చెప్పి తనను సంగమేశ్వర్ స్టేషన్ కు తరలించినట్లువెల్లడించారు. తనను స్టేషన్ కు తీసుకెళ్లిన తర్వాత డీసీపీ గదిలోకి వెల్లి రెండు గంటల పాటు బయటకు రాలేదని.. ఆయన వల్ల తన ప్రాణాలకు హాని ఉందని కేంద్రమంత్రి ఒక మీడియా ప్రతినిధితో వీడియోకాల్ లోఆందోళన చేయటం చూస్తుంటే.. ఈ దేశం ఏటు వెళుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. కేంద్రమంత్రి కావటంతో ఆయన చేతిలో ఉన్న ఫోన్ తీసుకునే సాహసం చేసి ఉండకపోవచ్చు. అదే సామాన్యుడైతే.. రెండు పీకి చేతిలో ఉన్న సెల్ ఫోన్ తీసేసుకోవటం ఖాయం. అదే జరిగితే.. వారి పరిస్థితి ఏమిటి?

రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి డిసైడ్అయ్యాక.. కేంద్రమంత్రిస్థాయిలో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని.. బెయిల్ ఇవ్వటానికి రాత్రి వరకు టైం తీసుకున్నప్పుడు.. సామాన్యులు ఒకసారి బుక్ అయితే ఇక అంతే సంగతులా? అన్న సందేహం కలుగక మానదు. తాను చెంప పగలగొడతానని అనలేదని.. చెంప పగలగొట్టేవాడినని మాత్రమే అన్నట్లు ఆయన చెబుతున్నారు. అయినా.. పంద్రాగస్టు వేళ.. స్వాతంత్య్రం వచ్చి ఎన్నాళ్లు అయ్యిందని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఉద్ధవ్ లాంటి పెద్ద మనిషి.. వెనుదిరిగి ప్రశ్నించటం ఏమిటి? ఎవరూ ఆయన తీరును ప్రశ్నించరా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మొత్తంగా.. ఈ దేశంలో పవర్ ఎవరి చేతిలో ఉంటే.. వారు అనుకోవాలే కానీ.. ఏమైనా చేయగలరన్న విషయాన్ని తాజాగా మరోసారి ఫ్రూవ్ చేశారని చెప్పాలి.
Tags:    

Similar News