తెలంగాణకు మోడీ ఏమి చేశాడో చెప్తావా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి?

Update: 2022-08-03 05:30 GMT
తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలుగంటున్న బీజేపీ ఇప్పుడు పార్టీ బలోపేతం కోసం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ల నుంచి బలమైన నేతలను లాగేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో తొలి వికెట్ ‘కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి’. ఆయనను పార్టీలోకి లాగడంలో సక్సెస్ అయ్యింది. అయితే ఇక్కడ చిక్కు ఏమిటంటే..? అధికార టీఆర్ఎస్  తెలంగాణలో బలం ఉంది. చెప్పుకోవడానికి అభివృద్ధి, సంక్షేమం ఉంది. ఇక కాంగ్రెస్ కు ఏకంగా తెలంగాణ ఇచ్చిన చరిత్ర ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతోంది.

కానీ బీజేపీకి ఏముంది? అంటే వెతుక్కోవాల్సిందే.. తెలంగాణ విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై.. సవతి ప్రేమపై టీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లారు. తెలంగాణ ప్రజలు దాన్ని నమ్మి బీజేపీపై ఒకింత డిఫెన్స్ లో ఉన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ బలం కంటే అభ్యర్థుల బలంపైనే బీజేపీ గెలిచేసింది. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్, దుబ్బాకలో రఘునందన్ రావు ముఖాలు చూసి జనాలు ఓటేశారు. కానీ తెలంగాణ వ్యాప్తంగా అలాంటి నేతలు లేరు.. బీజేపీకి బలం లేదు. అందుకే దక్షిణ తెలంగాణలోని హుజూర్ నగర్, నాగార్జున సాగర్ లలో బీజేపీ సోదిలోనే లేకుండా ఓడిపోయింది. ఇప్పుడు ఇలాంటి బీజేపీ నుంచి పోటీచేయడానికి కాంగ్రెస్ కు రాజీనామా చేశాడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ లో ఎంతో ఎదిగిన కోమటిరెడ్డి సొంత అన్నను.. సొంత పార్టీని కాదని కమలదళంలో చేరారు.

కాంగ్రెస్ లో స్టూడెంట్ లీడర్ నుంచి ఎదిగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తర్వాత తన తమ్ముడిని నేరుగా ఎంపీగా పోటీచేయించి గెలిపించుకొని రాజకీయాల్లో నిలబెట్టాడు. నల్గొండలో బలమైన కాంగ్రెస్ పునాదులు ఉండడంతో ఈ అన్నాదమ్ముళ్లు రాజకీయంగా ధృడంగా నిలబడగలిగారు. అయితే ఆదినుంచి అన్న వెంకటరెడ్డికి, తమ్ముడు రాజగోపాల్ రెడ్డి దారులు వేరుగానే ఉన్నాయి.. కోమటిరెడ్డి కాంగ్రెస్ ను తిట్టి ఆ పార్టీలోనే ఉంటున్నా.. రాజగోపాల్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ ను బయటకు వచ్చారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీనే వీడి విమర్శలు గుప్పిస్తున్నారు.  

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్ లో మోడీని అమిత్ షాను ఆకాశానికి ఎత్తడం చూసి ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు అవాక్కవుతున్నాయి. ‘తెలంగాణకు మోడీ షాలు ఏమీ చేశారని పొగుడుతున్నావ్’ అంటూ మేధావులు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు.  తెలంగాణకు కాంగ్రెస్ మంజూరు చేసిన ‘ఐటీఐఆర్’ ఇచ్చి బీజేపీ ఉద్యోగాలు సృష్టించిందా? అని ప్రశ్నిస్తున్నారు. ఉన్న ఐటీఐఆర్ ను తెలంగాణకు ఇవ్వకుండా రద్దు చేసి మోసం చేసిందంటున్నారు. పోనీ ఏదైనా జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చి తెలంగాణను డెవలప్ చేసిందా? అని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా వదిలిపెడితే కనీసం ఒక్క ఫ్యాక్టరీ అయినా తీసుకొని వచ్చి వేల మందికి బీజేపీ జాబ్ ఇచ్చారా? అని ప్రశ్నిస్తున్నారు.
 
జీహెచ్ఎంసీ వరదల వచ్చిన సమయంలో అక్కడి ఓట్ల కోసం నాడు బీజేపీ ‘బైక్ పోతే బైక్.. కార్ పోతే కార్ ఇస్తాం’ అని హామీ ఇచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ ప్రకటన చేసి దుమారం రేపారు. దీంతో జనాలు నమ్మి బీజేపీనే గెలిపించారు. ఆ ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అలాంటివేవి ఇవ్వకపోగా కనీసం నిధులతో కూడా ఆ వార్డుల్లో అభివృద్ధి చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇక ఉప ఎన్నికల్లో గెలిపించిన దుబ్బాక, హుజూరాబాద్ కు ఏమైనా అదనపు నిధులు తెచ్చారా? ఆ బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్రం నుంచి అని కొందరు ప్రశ్నిస్తున్నారు.  అసలు బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. కాంగ్రెస్ లో గెలిచాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ లోనే ఎంత ఎత్తుకు ఎదిగాడు. అలాంటి కాంగ్రెస్ ను విస్మరించి బీజేపీ అది చేసింది.. ఇది చేసింది అని.. మోడీని, అమిత్ సాను పొగుడడం ఏంటి రాజగోపాల్ రెడ్డి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.  

ఒక పక్క తెలంగాణ బద్ద వ్యతిరేకి అయిన వైఎస్ఆర్ కూతురు షర్మిలకు ఫోన్ చేసి ఆమెను పొగుడుతావ్.. మరో పక్క అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చూసి రాజగోపాల్ రెడ్డిని ఆదరిస్తున్నారు కానీ.. సొంతంగా ఎదిగిన నాయకుడిగా మాత్రం ఆయనను చూడడం లేదని మేధావులు అంటున్నారు.  ఇప్పుడు రాజీనామా చేసిన మునుగోడులోనూ రాజగోపాల్ రెడ్డి పెద్దగా పొడిచింది ఏమీ లేదని ఆ నియోజకవర్గ ప్రజలు విమర్శిస్తున్నారు. ఉప ఎన్నిక వస్తే ఓడిస్తామని అంటున్నారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి అనుచరవర్గం, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఎంపీపీలు అంతా టీఆర్ఎస్ లో చేరిపోయారు. మునుగోడులో బీజేపీకి అసలు క్యాడర్, నేతలు, బలం లేదు. ఆ పార్టీని నమ్మి మునుగోడు ఉప ఎన్నికల్లో నిలబడుతున్న రాజగోపాల్ రెడ్డి పుట్టి మునగడం ఖాయమంటున్నారు.
Tags:    

Similar News