పవన్ చెప్పే దక్షిణాది వివక్షను చేతల్లో చూపిన మోడీ

Update: 2017-03-17 04:13 GMT
మేనేజ్ మెంట్ గురుకు మించిన మాటలు.. భారీ ఆదర్శాల్ని వల్లించే ప్రధాని మోడీ మాటలకు.. చేతలకు మధ్యనున్న వ్యత్యాసం మరోసారి బట్టబయలైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరచూ ఉత్తరాది అహంకారం.. దక్షిణాది పట్ల వివక్షను ప్రస్తావిస్తే కొందరు తప్పు పడతారు. కానీ..అది అక్షర సత్యమన్న విషయం సాక్ష్యాలతో సహా తాజాగా రుజువైందని చెప్పాలి.

రెండు రాష్ట్రాలుగా ముక్కలైన తెలుగు నేలలో పుట్టెడు కష్టాలున్న విషయం తెలిసిందే. వరుస కరవుతో కిందామీదా పడుతున్న తెలుగు రైతుల్ని ఆదుకునేందుకు రుణమాఫీని అమలు చేస్తామని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఓట్లను కొల్లగొట్టే ఈ విధానం సరికాదని.. అంత భారాన్ని మోపే శక్తి ప్రభుత్వాలకు లేదని..అబద్ధపు హామీలతో రైతుల్ని మాయ చేయొద్దంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ లాంటి వారు స్పష్టమైన వైఖరిని ప్రదర్శించారు. ప్రాక్టికల్ గా జరిగే మాటలు కాస్తంత చేదుగా ఉన్నా..అవి వాస్తవాలన్న విషయం మర్చిపోకూడదు. ఎన్నికల వేళ.. రుణమాఫీ అంటూ చెబుతున్న అధినేతలు.. పవర్ లోకి వచ్చాక తమ మాటల్ని పూర్తిగా మార్చేస్తారని.. వారి మాదిరిగా గాలి మాటలు చెప్పేసే తీరు తనకు లేదని.. మాట మీద నిలబడే విషయంలో తాను తన తండ్రి మాదిరే వ్యవహరిస్తానని జగన్ చెప్పేవారు.

ఆయన మాటలు ఎంత నిజమన్న విషయం.. ఎన్నికల ఫలితాలు విడుదలై.. అబద్ధపు హామీలుతో అధికారంలోకి వచ్చిన ఇద్దరు చంద్రుళ్లు.. రుణమాఫీ అమలుకు పరిమితులు పెట్టటమే కాదు.. తాము ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కేంద్రం సాయాన్ని కోరారు. రుణమాఫీ లాంటి భారీ కోర్కెల్ని తీర్చేందుకు కేంద్రం సిద్ధంగా లేదన్న విషయాన్నిస్పష్టం చేసిన మోడీ.. నిదుల్ని పప్పు బెల్లాల మాదిరి పంచి పెట్టే తీరు సరికాదంటూ కటువుగా వ్యహరించారు.

ఆయన తీరుతో.. ఆర్ బీఐ కూడా తెలుగు ప్రభుత్వాలకు సాయం చేసేందుకు ఏ మాత్రం ముందుకు రాలేదు. కనీసం రుణా రీషెడ్యూలింగ్ కు కానీ.. చెల్లింపుల వాయిదాకో ఆర్ బీఐని ఒప్పించాలంటూ తెలుగు రాష్ట్రాలు గడ్డం పుచ్చుకొని బతిమిలాడినా.. ససేమిరా అన్న.. నిర్దాక్షిణ్యంగా నో చెప్పేసింది. రెండు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ అన్నా.. మీ చావు మీదేనంటూ సాయం చేసేందుకు.. ఆపన్న హస్తాన్ని ఇచ్చేందుకు నో చెప్పేసిన మోడీ సర్కారు..తాజాగా మాత్రం అందుకు భిన్నమైన ధోరణిని ప్రదర్శించింది.

యూపీలో పాగా వేసేందుకు రుణమాఫీ మాటను రాజకీయ అస్త్రంగా చేసుకొని.. భారీ హామీని తనకు తానే ఇచ్చేశారు ప్రధాని మోడీ. యూపీ ఎన్నికల ప్రచారంలో తాను చెప్పిన మాటను.. వెనువెంటనే అమలు చేసేందుకు సిద్ధమయ్యారు మోడీ. తాజాగా లోక్ సభలో యూపీకి ఇస్తానన్న రుణమాఫీ గురించి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యాసాయ శాఖామంత్రి రాధామోహన్ సింగ్ ప్రకటన చేశారు. లోక్ దళ్ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన బదులిస్తూ.. ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో రైతుల రుణాల్నిమాఫీ చేస్తుందని.. ఆ ఆర్థికభారాన్ని కేంద్రం భరిస్తుందని విస్పష్టంగా వెల్లడించటం గమనార్హం.

కొన్ని రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్షను ప్రదర్శిస్తోందన్న విమర్శను తిప్పి కొట్టిన కేంద్రమంత్రి.. ఏదైనా రాష్ట్రం రైతులకు రాయితీ ఇవ్వాలనుకోవటం అభినందించదగ్గ విషయం అంటూ కొత్త తరహా మాటల్ని చెప్పుకొచ్చారు. జనసేన అధినేత నోటి నుంచి ఉత్తరాది అహంకారం.. దక్షిణాది పట్ల వివక్ష మాటలు ఎంత నిజమో తాజాగా మోడీ సర్కారు నిర్ణయం చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తనకు రాజకీయ లబ్థి చేకూరే వారి విషయంలో ఒక తీరు.. లేని వారి విషయంలో మరో తీరు అన్న ధోరణి మాత్రమే కాదు.. తమకు రాజకీయ లాభం కలుగుతుందన్న ఆశతో.. బీహార్.. జమ్మూకశ్మీర్ రాష్ట్రాల పట్ల ప్రదర్శించిన ప్రత్యేక ప్యాకేజీ హామీల్ని చూసినప్పుడు.. మోడీ సర్కారుకు ఉత్తరాది మీద ఉండే అభిమానం.. దక్షిణాది మీద ఉండే వివక్ష ఎంతన్నది ఇట్టే అర్థమవుతుందని చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News