ప్లీనరీ సాక్షిగా : వాసుపల్లి మీటింగ్ కి కార్పోరేటర్లు డుమ్మా

Update: 2022-06-25 01:30 GMT
వైసీపీ నియోజకవర్గ స్థాయిలో ప్లీనరీలు నిర్వహిస్తోంది. ఈ ప్లీనరీలలో పార్టీలోని అసలు విషయం ఏంటో తెలుస్తోంది. చాలా మంది నాయకులు తమ అసమ్మతిని వెళ్ళగక్కడానికి ప్లీనరీని వాడుకుంటున్నారు.

ఇక విశాఖ జిల్లా  దక్షిణ నియోజకవర్గంలో జరిగిన వైసీపీ ప్లీనరీ విషయం తీసుకుంటే ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మీటింగుకు తాము హాజరు కామని ఏకంగా సొంత పార్టీకి చెందిన కార్పోరేటర్లు డుమ్మా కొట్టేఅరు.

వాసుపల్లి టీడీపీ వారికే ప్రాధ్యాన్యత ఇస్తున్నారని, ఆయన అక్కడ నుంచి వచ్చి వైసీపీలో కూడా వారికే చోటిస్తే తామెందుకు అని మండిపడుతున్నారు. ఒక వైపు తన సొంత నియోజకవర్గంలో పార్టీకి పండుగ లాంటి ప్లీనరీ జరుగుతూంటే ఎనిమిది మంది కార్పోరేటర్లు బీచ్ రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్ద ఆయనకు నివాళి అర్పించి పార్టీలో తమకు ప్రాధాన్యత లేదని వాపోవడం విశేషం.

అంతే కాదు వారంతా వాసుపల్లి దక్షిణ నియోజకవర్గంలో చేస్తున్న అన్యాయాన్ని చెబుతామని అంటున్నారు. తమతో ఏ మాత్రం సంప్రదించకుండా వార్డు కమిటీలను వాసుపల్లి ఎలా వేస్తారు అని వారు అంటున్నారు. అంతా తన వారిని టీడీపీ మనుషులను వేసుకున్నారు అని వారు ఆరోపిస్తున్నారు. ఇంకో వైపు కార్పోరేటర్లు ప్లీనరీకి రాకపోవడం పట్ల వాసుపల్లి కూడా అసహనం వ్యక్తం చేశారు.

తాను పార్టీలో అందరినీ సమానంగా చూస్తున్నానని, వైసీపీలో తాను వచ్చింది ఇక్కడే తుదిశ్వాసవరకూ ఉండడానికి అని చెప్పారు వైఎస్సార్ అంటే తనకు అభిమానం అని ఆయన అన్నారు జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ విజయం సాధిస్తుంది అని వాసుపల్లి పేర్కొన్నారు.

ఆయన స్పీచ్ ఎలా ఉన్నా ప్లీనరీ పెడితే సౌత్ నుంచి నెగ్గిన మొత్తం తొమ్మిది మంది వైసీపీ కార్పోరేటర్లలో ఎనిమిది మంది డుమ్మా కొట్టగా కేవలం ఒకే ఒక కార్పోరేటర్ హాజరు కావడం వాసుపల్లికి సొంత పార్టీలో మద్దతు ఎంత వరకూ ఉందో చెబుతోందని మొదటి నుంచి పార్టీలో ఉన్న వారు అంటున్నారు. అయితే జగన్ హామీ ఇచ్చారు కాబట్టి టికెట్ తనకేనని, తానే మళ్ళీ పోటీ చేసి గెలుస్తానాను అని వాసుపల్లి ధీమాగా ఉన్నారు.
Tags:    

Similar News