వెజ్ మొసలి 'బాబియా' ఇక లేదు.. శోకసంద్రంలో భక్తులు

Update: 2022-10-11 04:44 GMT
 శాఖాహార మొసలి ఏంటి? అది చనిపోతే భక్తులు శోకంలో మునిగిపోవటం ఏమిటి? దాన్ని కడసారి చూసేందుకు వేలాది మంది పోటెత్తటం ఏమిటి? ఇంతకీ మొసలి ఏంటి.. శాఖాహారం ఏమిటి? అన్న సందేహాలు అక్కర్లేదు. కేరళలోని కాసర్ గాడ్ జిల్లా అనంతపురలో కొలువైన అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ఒక విశిష్ఠత ఉంది. ఆ ఆలయంలోని పుష్కరిణిలో ఒక మొసలి ఉంటుంది. మనిషి కనిపిస్తే చాలు.. ఏ మాత్రం ఆలోచన లేకుండా చంపేసే గుణం ఉన్న జాతి తీరుకు భిన్నంగా.. భక్తులు పెట్టే ప్రసాదాన్ని మాత్రమే తినే ఈ శాఖాహార మొసలి విష్ణుమూర్తి సొంత మొసలిగా భావిస్తారు భక్తులు.

తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయానికి మూలస్థానంగా చెప్పే అనంతపుర ఆలయ పుష్కరిణిలో ఈ మొసలి గడిచిన 70 ఏళ్లుగా ఉంటోంది. ఎప్పుడు.. ఎవరికి హాని తలపెట్టని ఈ మొసలి తాజాగా కన్నుమూసింది. దీన్ని బాబియా పేరుతో భక్తులు పిలుస్తుంటారు. ఆలయానికి వచ్చే భక్తులు పెట్టే అన్నం.. బెల్లంతో తయారు చేసే దేవుడి ప్రసాదమే తప్పించి.. మరింకేమీ తీసుకోని ఈ మొసలి పుష్కరిణిలో ఒంటరిగా ఉంటుంది.

ఆలయంలోని దేవుడ్ని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు.. బాబియాను కూడా దర్శించుకుంటారు. ప్రసాదాల్ని ఇస్తుంటారు. చుట్టూ ఎలాంటి సరస్సు లేకున్నా.. మొసలి రావటం అంతా దేవుడిలీలగా చెబుతుంటారు. ఆలయ చరిత్రను చూస్తే.. బాబియో మూడో మొసలిగా చెబుతుంటారు. ఒకటి తర్వాత ఒకటిగా ఎలా వస్తుందో తెలీకుండా పుష్కరిణిలోకి వస్తుందని చెబుతారు. ఆదివారం రాత్రి 11.30 గంటల వేళలో బాబియా తుదిశ్వాస విడిచినట్లుగా అధికారులు గుర్తించారు.

దీంతో పశు సంవర్ణక శాఖ అధికారుల సమక్షంలో దానికి అంత్యక్రియులు జరిపారు. వందలాది మంది భక్తులు ఈ మొసలిని కడసారి చూసేందుకు వచ్చారు.'బాబియో విష్ణు పాదాల చెంతకు చేరుకుంది. 70 ఏళ్లుగా ఆలయాన్ని కాపాడింది' అంటూ కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజే ట్వీట్ చేశారు. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉండే ఈ మొసలి భగవంతుని ప్రతిరూపంగా చెబుతుంటారు. మరి.. బాబియో తర్వాత కొలనులో ప్రత్యక్షమయ్యే మొసలి ఎప్పుడో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News