వీక్ నెస్ తోనే విక్టరీ..?

Update: 2022-03-20 10:30 GMT
ఎదుటివారి బలహీనత అవతల వారికి ఎపుడూ బలం అవుతుంది. రాజకీయాల్లో ఈ సూత్రం చాలా బాగా పనిచేస్తుంది. రెండు వీక్ నెస్ లు కలిస్తే ప్లస్ కూడా అవుతాయి. సక్సెస్ కూడా దక్కుతుంది. ఇదంతా పొలిటికల్ మాథమెటిక్స్. ఏపీలో ఇపుడు ఒకరి వీక్ నెస్ ని పట్టుకుని మరొకరు పాలిట్రిక్స్ చేయడానికి చూస్తున్నారు.

ఏపీలో విపక్షం తమకు తాముగా బయటపెట్టుకున్నది ఏంటి అంటే తాము ఒంటరిగా జగన్ని ఎదుర్కోలేమని. నిజానికి అది రాజకీయంగా పార్టీలు చెప్పాల్సిన మాట కాదు కానీ అది కూడా ఒక వ్యూహంగా భావించి రాజకీయ నేతలు ఈ తరహా స్టేట్మెంట్స్ వదులుతున్నారు.

ఈ రోజు పవన్ అన్నా నిన్న చంద్రబాబు అన్నా అంతకు ముందు మరొకరు అన్నా అందరిదీ ఒకే మాట. ఏపీలో మూకుమ్మడిగా విపక్షాలు వైసీపీ మీద పడాలి. అపుడే విజయం తధ్యం అన్నది వారి ఆలోచన. ఇదిలా ఉంటే ఇందులో కూడా ఒకరి మీద ఒకరు పై చేయి సాధించేందుకు చూస్తున్నారు.

సీట్ల బేరానికి ఒకరి వీక్ నెస్ ని అడ్డుపెట్టుకుని మరొకరు కధ రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అదెలా అంటే టీడీపీకి 2024 ఎన్నికలు చావో రేవోలాంటివి. ఆ విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు. ఈ సారి టీడీపీ గెలిచిందా. మరిన్నేళ్ళు ఊపిరిపోసుకున్నట్లే. ఒక వేళ ఓడిందా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి.

అందువల్ల ఈ పొత్తులు ఎత్తులు అన్నీ కూడా గురి చూసి మరీ టీడీపీ మీదనే జనసేన లాంటి పార్టీలు ప్రయోగిస్తున్నాయి. పొత్తులు మా కంటే మీకే అవసరం అని చెప్పకనే చెబుతున్నాయి. ఒంటరిగా వైసీపీని ఎదుర్కోవడం కష్టం కాబట్టి మాతోనే జట్టు కట్టాల్సిన అవసరం మీదే అని కూడా చెబుతున్నాయన్నమాట.

నిజమే టీడీపీ బలమెంతో ఎవరికీ తెలియదు కానీ ఆ పార్టీయే ఇపుడు వన్ సైడ్ లవ్ అంటూ తన గుట్టు బయట పెట్టుకున్నాక ఇలాంటి పొలిటికల్ ఆటలకు టార్గెట్ కావాల్సిందే. అయితే టీడీపీ అంత తేలిగ్గా బుట్టలో పడుతుందా. సరే మాకు పొత్తులు అవసరమే. కానీ మాకు స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. ఫార్టీ ఇయర్స్ హిస్టరీ ఉంది. ఫౌండేషన్ గట్టిగా ఉంది. బేస్ మెంట్ కూడా ఫిట్ గా ఉంది.

కానీ జనసేనకు 2024 ఎన్నికలు చాలా కీలకమని తమ్ముళ్ల నుంచి వస్తున్న మాట. అప్పటికి పార్టీ పెట్టి పదేళ్ళు అవుతుంది. ఒంటరిగా వెళ్లినా టీడీపీ అండ లేకపోయినా జనసేనకు చేదు అనుభవాలే ఎదురవుతాయన్నది టీడీపీ ఆలోచన. అలా కనుక జరిగితే తరువాత ఎన్నికలకు జనసేన ఉనికి పోరాటం చేయాల్సిందే అన్నది వారి మార్క్ విశ్లేషణ.

నిజంగా చూసుకున్నా జనసేనకు 2024 ఎన్నికలు అతి ముఖ్యమైనవే. ఆ ఎన్నికల్లో గట్టిగా పోరాడి తనకంటూ ఒక అధికార బలాన్ని సంపాదించుకోలేకపోతే మాత్రం జనసేనకు ముందున్నది ముసళ్ళ పండుగ అని విశ్లేషణలు కూడా ఉన్నాయి.

దాంతో టీడీపీకే కాదు, జనసేనకు కూడా వీక్ నెస్ ఉందని అంటున్నారు అందుకే ఒకరి వీక్ నెస్ మరొకరు ఎత్తుకోకుండా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా జత కలిస్తే రెండింటికీ మంచిదని అంటున్నారు. సరే ఈ పొత్తులు ఎత్తులు వ్యవహారంలో విపక్షం బిజీగా ఉంటే అధికార పక్షం కూడా ఈ వీక్ నెస్ నే సొమ్ముగా చేసుకోవాలనుకుంటోంది.

జగన్ని ఒంటరిగా ఎదుర్కోవడం ఎవరితరం కాదు అంటూ యావత్తు విపక్షాన్ని డీ మోరలైజ్ చేసే ప్రయత్నం అయితే అధికార పార్టీ నుంచి గట్టిగా జరుగుతోంది. తరచూ ఇదే మాటను మంత్రి కొడాలి నాని అంటున్నారు. మీరు మొత్తం సీట్లు కాదు, గట్టిగా 160 సీట్లకు ఒకే పార్టీ పోటీ చేయగలదా, అభ్యర్ధులను నిలబెట్టగలరా అని ఆయన సవాల్ చేయడం వెనక వ్యూహం ఇదే. మీరు సింగిల్ గా రావాలి. జగన్ని ఎదుర్కోవాలి అంటూ నాని ఇస్తున్న పిలుపు వెనక విపక్షం వీక్ నెస్ ని బట్టబయలు చేయాలన్న పక్క ప్లాన్ ఉందని అంటున్నారు.

మొత్తానికి విపక్షం సింగిల్ గా రాదు, రాలేదు, అందరూ కలసినా గెలవలేరూ  అంటూ గాలి తీసే పనిలో వైసీపీ ఉంటే, విపక్షాలు సీట్ల బేరాల దగ్గర ఎదుటి వారి బలహీనతలను  ముందుకు తెస్తున్నాయి. మొత్తానికి చూస్తే ఇంతకు ముందు బలాన్ని నమ్ముకుని యుద్ధం చేసేవారు. ఇపుడు మారిన సీన్ లో ఎదుటి వారి వీక్ నెస్ లోనే తమ విక్టరీ చూడాలనుకుంటున్నారు. 2024లో ఎవరి వీక్ నెస్ నెగ్గుతుంది. ఎవరు విక్టరీ కొడతారు అన్నది తేటతెల్లమవుతుంది. అంతవరకూ వెయిట్ అండ్ సీ.
Tags:    

Similar News